హైదరాబాద్: జులై 9న కొత్త కోచ్ను ప్రకటిస్తామని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బాగా ఆడిందని, అయితే దురదృష్టవశాత్తూ తుదిపోరులో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. ఇకపై టీమిండియా దృష్టంతా 2019 ప్రపంచకప్పైనే ఉందన్నారు.
2019 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే సిద్ధమవుతోందని అన్నారు. 2019 వరల్డ్ కప్ను గెలిచి తిరుమల శ్రీవారికి బహుమతిగా ఇస్తామని ఆయన అన్నారు. 2019లో జరగనున్న వరల్డ్ కప్ ఇంగ్లాండ్లోనే జరుగుతుందని, అందుకు తగినవిధంగా జట్టు సిద్ధమవుతుందని అన్నారు.
ఇప్పటి నుంచి వరల్డ్ కప్ జరిగే లోపు టీమిండియా 55 వన్డేలు ఆడుతుందని అన్నారు. వాటిలో కొత్త కుర్రాళ్లకు అవకాశాలిచ్చి అనుభవం సంపాదించుకొనేలా చేస్తామని ఎమ్మెస్కే చెప్పారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, సీనియర్ ఆటగాళ్లతో వారికి సలహాలు, సూచనలిప్పించి తీర్చిదిద్దుతామని చెప్పారు.
ప్రస్తుతం ఆ దిశగా టీమిండియా రాణిస్తోందని, తనకు బాగా తృప్తిగా ఉందని అన్నారు. రానున్న కాలంలో జట్టులో యువ ఆటగాళ్లకు చోటు కల్పిస్తామని చెప్పారు. జూలై 9న నూతన కోచ్ను ప్రకటిస్తామని తెలిపారు