న్యూఢిల్లీ: పాత్రికేయుడి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ ఇష్యూ పైన బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం మాట్లాడుతూ.. ఇది మిస్ అండర్ స్టాండింగ్ అయిన ఇష్యూ అని, అయినా ఈ విషయంతో టీమిండియాను డిస్టర్బ్ చేయవద్దని, జట్టు ప్రపంచకప్ పైన దృష్టి సారించేలా చూడాలని హితవు పలికారు.
పాత్రికేయుడిని తిట్టిన అంశం పైన కోహ్లీ ఇప్పటికే స్పందించాడని, దాని పైన సమాధానం చెప్పాడన్నారు. అయితే, ప్రపంచకప్ చాలా ముఖ్యమని చెప్పారు. ప్రపంచకప్ నేపథ్యంలో అలాంటి విషయాన్నింటిని పక్కన పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఆ సమస్యకు ముగింపు పలకాలని కోరారు.

అయితే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ విషయమై తాను ఆటగాళ్లతో మాట్లాడలేదన్నారు. జట్టుతో టీమ్ మేనేజ్మెంట్ ఉందని చెప్పారు. అన్ని విషయాలను అది చూసుకుంటుందని చెప్పారు.
కాగా, పెర్త్లోని వాకా మైదానంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న కోహ్లీ తిరిగి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్నపుడు అతనికి మార్గమధ్యలో ఓ జాతీయ దినపత్రిక విలేకరి కనబడ్డాడు. అంతే ఆగ్రహంతో కోహ్లీ ఆయనపై బూతు పురాణం అందుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తనను ఎందుకు తిడుతున్నాడో కూడా తెలియని ఆ రిపోర్టర్ కూడా గందరగోళానికి గురయ్యాడు. అనంతరం సహచరులు సముదాయించడంతో కోహ్లీ అసలు విషయం చెప్పాడు. గతంలో తన గురించి, ప్రియురాలు అనుష్క గురించి అవాస్తవ కథనం రాసింది ఆ రిపోర్టరేనని తోటి ఆటగాళ్లకు చెప్పాడు. అయితే ఆ వార్త రాసింది సదరు రిపోర్టర్ కాదని తెలియడంతో కోహ్లీ అతనికి క్షమాపణలు చెప్పాడు.