ఐపీఎల్ ఫైనల్ జరిగే సమయంలో ఆసియా కప్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ లీగ్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్తాన్కు దక్కింది. అయితే తమ జట్టును పాక్కు పంపడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పింది. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును పాక్కు పంపలేమని కరాఖండీగా చెప్పేసింది.
దీంతో ఆసియా కప్ విషయంలో పాకిస్తాన్, భారత్ క్రికెట్ బోర్డుల మధ్య గొడవ జరుగుతోంది. మిగతా జట్లకు లేని బాధ, భయం భారత్కు ఎందుకని పాక్ మాజీ ఆటగాళ్లు కూడా మండిపడుతున్నారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏమాత్రం బాగాలేని తరుణంలో తమ జట్టును పాక్కు పంపడం కుదరదని బీసీసీఐ అంటోంది.

ఈ క్రమంలోనే హైబ్రీడ్ మోడల్లో ఈ టోర్నీ నిర్వహించేందుకు పాకిస్తాన్ ఒక ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం భారత్ ఆడే మ్యాచులు మాత్రం యూఏఈలో ఏర్పాటు చేస్తామని, మిగతా టోర్నీ అంతా పాక్లోనే జరుగుతుందని తెలిపింది. దీనికి కూడా బీసీసీఐ అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఆసియా కప్ వేదికను మార్చాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది.
'శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పాక్లో ఆడేందుకు సుముఖంగానే ఉన్నాయి. కానీ భారత్ మాత్రం హైబ్రీడ్ మోడల్కు కూడా అంగీకారం తెలపడం లేదు. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఉన్న ఏసీసీ సెక్రటరీ జై షా ఏర్పాటు చేసే ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మీటింగ్లో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది' అని ఏసీసీ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు.
త్వరలోనే జరిగే ఈ మీటింగ్లో హైబ్రీడ్ మోడల్పై ఓటింగ్ జరగుతుందా? అని ప్రశ్నించగా.. 'ఈ హైబ్రీడ్ మోడల్పై ఓటింగ్ జరగడం కుదరదు. కాబట్టి ఎవరినీ నొప్పించని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టోర్నీ ఆడేదే ఆరు దేశాలు. అలాంటప్పుడు మిగతా 19 దేశాలకు ఈ విషయంపై ఎలాంటి అవగాహన ఉండదు. వాళ్ల స్టాండ్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. అలాంటప్పుడు వారు ఈ విషయంలో ఎలా ఓట్లు వేస్తారు?' అని ఏసీసీ బోర్డు మెంబర్ అడిగారు.
అయితే ఐపీఎల్ ఫైనల్ వీక్షించేందుకు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డుల అధ్యక్షులు భారత్కు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆసియా కప్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీసీఐ అడిగినట్లే జరగాలంటే.. ఆసియా కప్ వేదికను శ్రీలంక లేదా బంగ్లాదేశ్కు మార్చాల్సి ఉంటుంది. పాకిస్తాన్ దీనికి ససేమిరా అంటోంది.