ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా ఉన్న అంశాలపై త్వరలోనే సమాధానాలు అందనున్నాయి. ముఖ్యంగా ఆసియా కప్ వేదిక విషయంలో ఇటీవల ఎంత రాద్ధాంతం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ విషయంపై మరికొన్ని గంటల్లోనే సమాధానం రాబోతోందట. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు.
తాజాగా బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో జై షా మాట్లాడారు. ఈ క్రమంలోనే కొన్ని కీలక అంశాలపై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చారు. ఆదివారం ఐపీఎల్ ఫైనల్ జరుగుతున్న సమయంలోనే ఆసియా కప్ వేదిక గురించి తీసుకున్న నిర్ణయం వెల్లడిస్తామని జై షా తెలిపారు.

అలాగే, ఐపీఎల్ ముగియగానే భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు రెడీ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగే ఈ ఫైనల్ సమయంలోనే వరల్డ్ కప్ షెడ్యూల్ను ప్రకటిస్తామని జై షా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ - నవంబరులో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.
వీటితోపాటు వరల్డ్ కప్ ప్రారంభం అవడానికి ముందే ఆఫ్ఘనిస్తాన్తో భారత జట్టు వన్డే సిరీస్ ఆడుతుందని జై షా తెలిపారు. అలాగే త్వరలోనే ఇండియా-ఎ జట్టు పర్యటనలు కూడా మొదలవుతాయని చెప్పారు. అంతేకాదు, భారత మహిళల జట్టు కోచ్ ఎంపిక జూన్ నెలలో జరుగుతుందని ప్రకటించారు.
ఈ అంశాలపై కీలక అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ముఖ్యంగా ఆసియా కప్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టోర్నీ అంతా పాకిస్తాన్లోనే నిర్వహించి, భారత మ్యాచులు మాత్రం యూఏఈలో ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం ఫైనల్ చేసిందో తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు.