టీ20 వరల్డ్ కప్-2024 భారత్ ఛాంపియన్గా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ను తృటిలో చేజార్చుకుని పగిలిన గుండెతో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు ఈసారి పొట్టికప్ను మిస్ చేయలేదు. టోర్నీ ఆద్యంతం విజయాలతో హోరెత్తిస్తూ జగజ్జేతగా నిలిచారు. ఫైనల్లో ఓ దశలో దక్షిణాఫ్రికా పైచేయి సాధించినా అద్భుత పోరాటంతో ఏడు పరుగుల తేడాతో నెగ్గారు.
అయితే ఫైనల్ అనంతరం స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. భవిష్యత్ తరానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్-కోహ్లి ప్రకటించారు. దశాబ్ద కాలం పాటు భారత విజయాల్లో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు.అన్నిఫార్మాట్లలో భారత బ్యాటింగ్కు మూలస్తంభాలుగా సేవలు అందించారు. అలాంటి ఈ ఇద్దరు ఒకేసారి పొట్టి ఫార్మాట్కు గుడ్బై పలకడంతో ప్రపంచకప్ గెలిచిన ఆనందంతో పాటు తమ ఫేవరేట్ ప్లేయర్లను టీ20ల్లో చూడలేమనే బాధ అభిమానుల్లో కలిగింది.

అంతేగాక వన్డే, టెస్టు ఫార్మాట్కు కూడా ఏ దశలో అయినా రిటైర్మెంట్ ప్రకటిస్తారనే సందేహాలు మొదలయ్యాయి. అయితే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కనీసం ఎప్పటివరకు భారత్కు ప్రాతినిథ్యం వహిస్తారనే విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నాడు. 2025లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ వరకు సీనియర్లు కచ్చితంగా జట్టులో ఉంటారని జైషా తెలిపాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి వయస్సు 35, రోహిత్ శర్మ వయస్సు 37 ఏళ్లు.
''టీమిండియా అన్ని టైటిళ్లు గెలవాలని కోరుకుంటున్నాను. ఆ రీతిలో భారత జట్టు పురోగతి సాధిస్తోంది. మా తర్వాతి లక్ష్యం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ మెగాటోర్నీలో సీనియర్లు ఉంటారు'' అని జైషా పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఇంగ్లండ్లోని లార్డ్స్ వేదికగా వచ్చే ఏడాది జూన్లో జరగనుంది. ఆ తర్వాత ఎనిమిది నెలలకే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి శ్రీలంకతో కలిసి భారత్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది.