13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ జగజ్జేతగా నిలిచింది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్గా అవతరించింది. 2011 వన్డే వరల్డ్ కప్ అనంతరం జరిగిన ప్రతి ప్రపంచకప్లో భారత్ ఫేవరేట్గానే బరిలోకి దిగింది. కానీ సెమీఫైనల్స్, ఫైనల్స్లలో ఓటమిపాలై ట్రోఫీలను చేజార్చుకుంది.
కానీ గత పొరపాట్లను సరిదిద్దుకుని ఈ టీ20 వరల్డ్ కప్లో భారత్ అసాధారణంగా చెలరేగింది. ఫైనల్లో ప్రత్యర్థి విజయానికి చేరువగా వెళ్లినా మన జట్టు ఓటమిని అంగీకరించలేదు. అద్భుతంగా పోరాడి దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ను ముద్దాడింది. అయితే ఈ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా రూ.125 కోట్ల నగదు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపాడు.

''ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. టోర్నమెంట్ ఆద్యంతం అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడాస్ఫూర్తితో టీమిండియా సత్తాచాటింది. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ఆటగాళ్లందరికీ, కోచింగ్ బృందానికి, సిబ్బందికి అభినందనలు'' అని జైషా ట్వీట్ చేశాడు.
కాగా, ఫైనల్లో మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) సత్తాచాటారు. మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. హార్దిక్ (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు.