భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ టీ20 టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర సంఘూలకు సోమవారం తెలియజేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్ రూల్ను ప్రయోగాత్మకంగా తొలుత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బీసీసీఐ అమలు చేసింది. అనంతరం ఐపీఎల్లోకి తీసుకువచ్చింది.
అయితే ఈ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చింది. ఐపీఎల్లో ఎంతో మంది కెప్టెన్లు, కోచ్లు దీన్ని వ్యతిరేకించారు. ఈ రూల్ ఆల్రౌండర్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ప్రధాన వాదన. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్తో ఆల్రౌండర్లకు బదులుగా స్పెషలిస్ట్ బ్యాటర్లు లేదా బౌలర్లు తుదిజట్టులో కొనసాగుతున్నారని, అంతేగాక భారీ స్కోరు నమోదు చేయడంలో, విజయవంతంగా భారీ ఛేదనను ముగించడంలో..ఈ రూల్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు బ్రాడ్కాస్టర్లకు ఇది మేలు చేసింది. ధనాధన్ ఇన్నింగ్స్లు, భారీ స్కోర్లతో వ్యూవర్షిప్ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2027 సీజన్ వరకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను కొనసాగిస్తామని ఇటీవల బీసీసీఐ ప్రకటించింది కూడా. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ దేశవాళీ టీ20 టోర్నీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15వరకు జరగనుంది.
కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండు బౌన్సర్ల నిబంధనను మాత్రం కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఒక ఓవర్లో రెండు షార్ట్ పిచ్ బంతుల్ని వేయడానికి బౌలర్కు అనుమతి ఇవ్వడమే ఈ నిబంధన సారాంశం. తొలుత ముస్తాక్ అలీ టోర్నీలో ప్రయోగాత్మకంగా దీన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా తీసుకువచ్చారు. బౌలర్లకు మేలు చేకూర్చే ఈ నిబంధనను మాత్రం దేశవాళీ టోర్నీలో, ఐపీఎఎల్లో కొనసాగించనున్నారు.