ఐపీఎల్ నిరవధిక వాయిదా
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, బోర్డు సెక్రటరీ జై షా, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్, బోర్డు ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఐపీఎల్పై సుధీర్ఘంగా చర్చించారు. మంగళవారం ఉదయం ప్రధాని లాక్డౌన్ను మే 3 వరకు పొడగించడంపై చర్చలు జరిపారు. సుదీర్ఘ చర్చలు తర్వాత ఐపీఎల్-13ను నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయించారు. లీగ్ను వాయిదా వేస్తున్న విషయాన్ని బీసీసీఐ మంగళవారమే అన్ని ఫ్రాంఛైజీలకు, బ్రాడ్కాస్టర్లకు చెప్పగా.. బుధవారం అధికారికంగా వెల్లడించింది.

టీ20 ప్రపంచకప్ రీషెడ్యూల్ చేస్తే
ఐపీఎల్ 2020 నిర్వహణపై మార్చి నుంచే ఫ్రాంఛైజీలతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా టోర్నీ నిర్వహణకి ఓకే చెప్పిన ఫ్రాంఛైజీలు.. విదేశీ క్రికెటర్లు లేకుండా మాత్రం ఐపీఎల్ వద్దని స్పష్టం చేశాయి. ఇక విదేశాల్లో నిర్వహించాలని చూసినా.. వైరస్ అంతటా ఉంది. ఆగస్టు-సెప్టెంబరులో మధ్యకాలంలో ఐపీఎల్ని నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది. మరోవైపు టీ20 ప్రపంచకప్ను ఐసీసీ, ఆస్ట్రేలియా రీషెడ్యూల్ చేస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్-నవంబర్ మధ్య లీగ్ను నిర్వహించే వీలుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అయితే రెండో విడుత లాక్డౌన్ ముగిసిన తర్వాతనే బీసీసీఐ లీగ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది.

మే 3 తర్వాతే
'ఐపీఎల్ 2020 భవితవ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. మహమ్మారి కరోనా వైరస్ సంక్షోభానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐపీఎల్ సమస్యకు పరిష్కారం కోసం భాగస్వాములందరితో బోర్డు ఎప్పటికప్పుడు చర్చిస్తుంది. మే 3 తర్వాత మాత్రమే పరిస్థితిని బీసీసీఐ సమీక్షిస్తుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

బీసీసీఐకి భారీ నష్టం
ఈ సంవత్సరం ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐ రూ.5000 కోట్ల నుంచి రూ.7500 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే బీసీసీఐ ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఐపీఎల్ రద్దు అయితే ఐదేళ్ల పాటు బీసీసీఐ నుంచి టెలికాస్ట్ హక్కులు తీసుకున్న స్టార్ ఇండియాకు రూ.3269 కోట్ల నష్టం వాటిల్లనుందట. ఈ ఐపీఎల్ అనేది కేవలం స్టార్ స్పోర్ట్స్కే కాకుండా స్టార్ నెట్ వర్క్కు ఆదాయం తెచ్చిపెట్టే వనరు. అలాగే టైటిల్ స్పాన్సర్ చేస్తున్న వీవో నుంచి కూడా రూ.400 కోట్ల ఆదాయం కోల్పోతుంది బీసీసీఐ.


Click it and Unblock the Notifications












