
బీసీసీఐ కఠిన నిర్ణయం
కొన్నిరోజుల క్రితం సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ.. సెలెక్షన్ కమిటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. చెప్పినట్లే సెలెక్షన్ కమిటీపై కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కివీస్తో సిరీస్కు ఎంపిక చేసిన జట్టుపై కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ సహా అందర్నీ తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది బీసీసీఐ.

చేతన్ శర్మ టీంపై విమర్శలు
ఆసియా కప్ వైఫల్యం తర్వాత సెలెక్టర్లపై విమర్శలు వచ్చాయి. ఫామ్లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని మాజీలు, అభిమానులు విమర్శించారు. ఇక టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత ఇది ఆగ్రహంగా మారింది. ఆ తర్వాత న్యూజిల్యాండ్ సిరీస్కు కూడా సరైన జట్టును ఎంపిక చేయకపోవడంతో అభిమానులు తిట్టిపోస్తున్నారు. చేతన్ శర్మ అండ్ కో బృందం పనితీరు కూడా ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎలాంటి మాటలూ లేకుండా సడెన్గా విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్గా తొలగించేసిన వివాదాస్పద నిర్ణయం కూడా ఈ బృందమే తీసుకున్న సంగతి తెలిసిందే.

దరఖాస్తుల ఆహ్వానం
చేతన్ శర్మ సహా మొత్తం సెలెక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించాలని నిర్ణయించింది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం ఏడు అంతర్జాతీయ టెస్టు మ్యాచులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు లేదా పది వన్డే, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన వారు ఈ పదవులకు అర్హులని ప్రకటించింది. అలాగే క్రికెట్ నుంచి కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యి ఉండాలని తెలిపింది. ఈ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటలు అని వెల్లడించింది. మరి ఈ పదవుల కోసం ఎవరు దరఖాస్తులు చేస్తానో చూడాలి.


Click it and Unblock the Notifications












