బీసీసీఐ చిట్కాలు:
ప్రాణాంతక కరోనా వైరస్ను అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలి. తద్వారా వైరస్ను నివారించొచ్చు. ఈ ప్రాణాంతక వైరస్ నుంచి తమను తాము కాపాడుకోడానికి బీసీసీఐ సైతం పలు సూచనలు చేసింది. అయితే వాటికి టీమిండియా క్రికెటర్ల ఫొటోలు జతచేసి అభిమానులను కనువిందు చేసింది.
ఇంటోనే ఉండండి:
'ఇంటోనే ఉండండి. బయటకు వెళ్ళడానికి ప్రయత్నించొద్దు' అని ఓ పోస్ట్ ద్వారా బీసీసీఐ అబిమానులకు విజ్ఞప్తి చేసింది. అయితే ఈ పోస్టుకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల పోటోలను జత చేసింది. కీపింగ్ చేస్తున్న ధోనీకి రోహిత్ వార్నింగ్ ఇచ్చేలా ఉన్న ఫొటో పెట్టడం అభిమానులను ఆకట్టుకుంది. 'మీరు బయటికి రావాలంటే.. దూరాన్ని పాటించండి' అని ఓ చిట్కా చెప్పి.. దానికి పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫొటో పెట్టింది.
సమాచారాన్ని అందరికీ పంపండి:
'మీ చేతులు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉన్నాయో చూసుకోండి' అని బీసీసీఐ మరో చిట్కా చెప్పింది. దీనికి రవీంద్ర జడేజా క్యాచ్ పడుతున్న ఫొటోను జత చేసింది. 'ఇంటి పనులకు సహాయం చేయండి' అని చెప్పి ఆటగాళ్లు మైదాన సిబ్బందికి సాయంచేసే ఫొటోను ఉంచింది. 'ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ పంపండి' అని చెప్పి.. కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు సూచనలు ఇస్తున్న ఫొటో పెట్టింది. ఇలానే బీసీసీఐ తమ అభిమానులకు కరోనాపై మరికొన్ని సూచనలు చేసింది.