
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి సీజన్ సక్సెస్. అనంతరం నిర్వహించిన సీజన్లకు క్రీడా అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. ఐపీఎల్ను చూసి వివిధ బోర్డులు కూడా పలు లీగ్ను నిర్వహిస్తున్నాయి. అయితే అవన్నీ ఐపీఎల్ అంత సక్సెస్ కాలేదు. ఐపీఎల్తో భారత దేశంలోని ఎందరో యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. అంతేకాదు ఎందరో ఆర్థికపరంగా కూడా లాభపడ్డారు.
లీగ్తో భాగస్వామ్యం ఉన్న అనేక మందికి ఐపీఎల్ ద్వారా లాభం పొందిన వారు ఉన్నారు. ఇందులో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా ఉన్నారు. 2019 ఐపీఎల్లో ఎనిమిది మంది భారత అంపైర్లకు చేసిన చెల్లింపుల వివరాలను తాజాగా బీసీసీఐ వెల్లడించింది. ఈ జాబితాలో మాజీ బౌలర్, మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కూడా ఉన్నారు. శ్రీనాథ్కు ఐపీఎల్ సీజన్-12 కోసం 52 లక్షల 45 వేల 128 రూపాయలు లభించాయి. శ్రీనాథ్తో సమానంగా అంపైర్ నితిన్ మీనన్కు కూడా 52 లక్షల 45 వేల 128 రూపాయలను ఐపీఎల్ ప్రాంఛైజీలు చెల్లించారు.
ఇక ఎస్. రవి రూ. 42.46 లక్షలు, మను నాయర్ రూ. 41.96 లక్షలు, షంషుద్దీన్ రూ. 41.00 లక్షలు... అనిల్ దండేకర్, యశ్వంత్ బెర్డే, నారాయణన్ కుట్టిలకు రూ.32.96 లక్షలు, నందన్ రూ. 37.04 లక్షలు లభించాయి. అంపైర్ల కంటే మ్యాచ్ రిఫరీల విధులు చాలా బాధ్యత గలవి అని తెలిసిందే. అంపైర్ల విధులు మ్యాచ్ మొదటి బంతి నుండి మొదలై చివరి బంతితో పూర్తవుతుంది. కానీ రిఫరీ.. ఆట సమయంలో ఐసీసీ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని గమనించడం, కోడ్ ఉల్లంఘనలను అంచనా వేయడం మరియు ఏదైనా ఉల్లంఘనలకు జరిమానాలు ఇవ్వడం, ఆట ముగిసిన తరువాత మ్యాచ్ రిపోర్టును ప్రధాన సంస్థకు సమర్పించడం వంటి బాధ్యతలు ఉంటాయి.