
షా మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలినా.. తేలికైన శిక్షతో వదిలేశారన్న ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. షా డోపింగ్ నిషేధానికి దారితీసిన సంఘటనల కాలపరిమితిని బీసీసీఐ విడుదల చేసింది.
పృథ్వీ షా నమూనాలను సేకరించడానికి, తుది నివేదికను అందించడానికి మధ్య నేషనల్ డోప్ టెస్టింగ్ లేబరేటరీ (ఎన్డీటీఎల్) రెండు నెలల సమయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం. అంతేకాదు షా డోపింగ్ విషయంలో మా తప్పేమీ లేదని కూడా పేర్కొందట. మరోవైపు షా డోపింగ్ కేసును ప్రపంచ డోపింగ్ నిరోధ సంస్థ (వాడా) మళ్లీ తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఈ కేసు జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) పరిధిలోకి వచ్చేందుకు బోర్డు తిరస్కరిస్తోంది. అయితే ముంబై టీ20 లీగ్, ఐపీఎల్లో ఆడేందుకు వీలుగా షా డోప్ పరీక్షా ఫలితాన్ని బీసీసీఐ ఆలస్యం చేసిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షల్లో పృథ్వీ షా విఫలమయ్యాడు. అతడి మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. దీంతో డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కమిటీ బీసీసీఐ ఏడీఆర్ ఆర్టికల్ 2.1 ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంది. 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. పృథ్వీ షాపై విధించిన నిషేధం నవంబరు 15తో ముగియనుంది.
నిజానికి క్రికెటర్లకు డోప్ టెస్ట్లు నిర్వహించే అధికారం బీసీసీఐకి లేదని స్పష్టం చేసిన కేంద్ర క్రీడల శాఖ.. అసలు బోర్డు ఎలా డోప్ టెస్ట్లు నిర్వహిస్తోందని ప్రశ్నించింది. ఈ మేరకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీకి కేంద్ర క్రీడల శాఖ లేఖ రాసింది. బీసీసీఐ ఆటగాళ్లకు నిర్వహిస్తోన్న డోప్ టెస్ట్లు అధ్వాన్నంగా ఉన్నాయని అందులో పేర్కొంది. డోప్ టెస్ట్లు, శిక్షలు ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని కేంద్ర క్రీడల శాఖ ఆ లేఖలో పేర్కొంది. అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్ టెస్ట్లు నిర్వహించాలని మరోమారు బోర్డుకు సూచించింది. అంతేకాదు బీసీసీఐకి వాడా గుర్తింపు లేదని పేర్కొంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ డోపింగ్ టెస్టులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయన్న పేర్కొనడం విశేషం.