హైదరాబాద్: నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి బీసీసీఐ గట్టి షాకిచ్చింది. భారత క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించే హక్కు నాడాకు లేదని స్పష్టం చేసింది. బీసీసీఐ అనేది నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) కాదని, ప్రస్తుతం తాము అనుసరిస్తున్న యాంటీ డోపింగ్ వ్యవస్థ సమర్థవంతంగా ఉందని నాడాకు రాసిన లేఖలో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి పేర్కొన్నారు.
బీసీసీఐ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కానప్పుడు అది నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ టోర్నీలపై నాడాకు ఎలాంటి హక్కు ఉండదని పేర్కొంది. అంతేకాదు క్రికెటర్లపై డోపింగ్ టెస్టులు నిర్వహించే అవకాశం కూడా లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సూచన మేరకు బోర్డు ఈ లేఖను నాడాకు రాశారు.

ఇక, నాడాకు సహకరించాలని కోరుతూ క్రీడాశాఖ కార్యదర్శి ఈ ఏడాది అక్టోబర్లో బీసీసీఐని కోరడంతో ఈ లేఖను ఆయనకు కూడా పంపించారు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిబంధనలకు లోబడే బీసీసీఐ ఓ యాంటీ డోపింగ్ వ్యవస్థను నడిపిస్తున్నదని, క్రికెటర్లకు అది చాలని జోహ్రి ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏ ఏజెన్సీకి శాంపిల్ కలెక్షన్లను పంపిస్తుందో బీసీసీఐ కూడా అదే ఏజెన్సీకి క్రికెటర్ల శాంపిల్స్ను పంపిస్తోందని.. ఇందులో ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదని కూడా జోహ్రీ లేఖలో పేర్కొన్నారు.
క్రికెటర్ల నుంచి సేకరించిన శాంపిల్స్ను ఇంటర్నేషనల్ డోపింగ్ టెస్ట్స్ అండ్ మేనేజ్మెంట్ (ఐడీటీఎమ్) వాడా ఆమోదించిన లేబొరేటరీకే శాంపిల్స్ను పంపిస్తుందని, అలాంటప్పుడు నాడా కూడా వాడా నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లే కదా? అని జోహ్రి తెలిపారు.
చివరగా బీసీసీఐ ఓ స్వతంత్ర సంస్థ అని, ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందని కూడా ఆయన అన్నారు. ఐసీసీ నిబంధనలకు మాత్రమే అనుగుణంగా పనిచేసే అధికారం బీసీసీఐ ఉందని ఆయన తేల్చి చెప్పారు.