
హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ కొత్త రాజ్యాంగానికి గుర్తింపు లభించింది. మంగళవారం చెన్నైలోని తమిళనాడు రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్లో ఈ రాజ్యాంగాన్ని బీసీసీఐ నమోదు చేయించింది. నూతన రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు.
నూతన రాజ్యాంగాన్ని నాలుగు వారాలలోపు నమోదు చేయించాలని ఆగస్టు 9న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ లోధా కమిటీ సిఫారసులకు అనుగుణంగా సీవోఏ రూపొందించిన ఈ రాజ్యాంగాన్ని ఆగస్టు 9న సుప్రీంకోర్టు కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సీఓఏ మాట్లాడుతూ "సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇందుకు అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని రిజిస్టర్ కూడా చేశాం. ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్లు రాష్ట్ర సంఘాలు 30 రోజుల్లోగా తమ అంగీకారాన్ని తెలపాలి" అని పేర్కొంది.
బీసీసీఐకి వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని చైర్మన్ వినోద్ రాయ్ అన్నారు. కొత్త రాజ్యాంగానికి ఆమోదం లభించడంతో బీసీసీఐకి త్వరోలనే ఎన్నికలు నిర్వహించేందుకు పరిపాలన కమిటీ (సీఓఏ) కసరత్తులు ప్రారంభించింది.