
హైదరాబాద్: పాకిస్థాన్ వేదికగా ఏప్రిల్లో జరగనున్న ఆసియా ఎమర్జింగ్ నేషన్స్ కప్కు భారత జట్టును పంపడానికి బీసీసీఐ నిరాకరించింది. దీంతో నిర్వాహకులు ఈ టోర్నీపై డైలమాలో పడ్డారు. పాకిస్థాన్కు జట్టుని పంపడానికి బీసీసీఐ సుముఖంగా లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి చెందిన ఓ అధికారి చెప్పాడు.
ఈ నేపథ్యంలో శ్రీలంక లేదా బంగ్లాదేశ్కు ఈ టోర్నీని తరలించే అవకాశాలున్నాయని తెలిపాడు. ఈ విషయంపై పీసీబీ ఛైర్మన్ నజీమ్ సేథీ దుబాయిలో మాట్లాడుతూ కోలంబోలో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సమావేశంలో ఆసియా ఎమర్జింగ్ నేషన్స్ కప్, సెప్టెంబరులో భారత్లో జరగాల్సిన ఆసియా కప్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.
2008 ముంబై ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్టా పాకిస్థాన్తో మ్యాచ్లు అడేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే పాకిస్థాన్తో తలపడుతోంది. అయితే, పాకిస్థాన్ మాత్రం భారత్తో ద్వైపాక్షిక సిరిస్లు నిర్వహించేందుకు తవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఏప్రిల్లో పాకిస్థాన్లో జరిగే ఆసియా ఎమర్జింగ్ నేషన్స్ కప్లో భారత జట్టు పాల్గొనకపోతే సెప్టెంబర్లో భారత్లో జరిగే ఆసియా కప్లో పాకిస్థాన్ పాల్గొనబోదని సేథీ అన్నట్లు సమాచారం. అంతేకాదు ఏప్రిల్లో కోల్కతా వేదికగా జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్లో కూడా అతడు పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.
ఈ మీటింగ్ కోసం భారత ప్రభుత్వం అతడికి వీసా మంజూరు చేస్తుందో లేదో చూడాలి మరి. దీనిపై కూడా సేథీ స్పందించాడు. 'ఐసీసీ బోర్డు మీటింగ్ కోసం భారత్కు వెళ్లాలని లేదు. ఇండియా అథారిటీస్ వీసా జారీ చేస్తే వెళ్తా. వీసా జారీ చేయకపోతే ఐసీసీ చూసుకుంటుంది' అని వెల్లడించాడు.