
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొనసాగించాలా వద్దా? అనే విషయంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.
బాల్ టాంపరింగ్ వివాదంపై ఆదివారం ట్విట్టర్లో స్పందించిన ఆయన తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడుతూ 'ఏప్రిల్ 7నుంచి ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. ఒకటి రెండు రోజుల్లోపే దీనిపై నిర్ణయం ప్రకటిస్తాం. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది సరైంది కాదు' అని అన్నారు.
'ఈ వివాదంపై బీసీసీఐతో చర్చలు జరుపుతున్నాం. ఇది చాలా సీరియస్ విషయం. ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూడా చూడాలి' అని ఆయన అన్నారు. కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే అస్ట్రేలియా స్పోర్ట్స్కమిషన్(ఏఎస్సీ)కు చెందిన ఇయాన్ రాయ్, ప్యాట్ హోవర్డ్లు దక్షిణాఫ్రికాకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ విచారణ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకోనుంది. 'ప్రస్తుతానికి ఆసీస్ కెప్టెన్గా స్మిత్ ఉంటాడు. అయితే, ఈ ఉదంతానికి కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. పూర్తి వివరాలు అందిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటాం' అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ వివరించారు.
మరోవైపు ఈ ఘటనను తీవ్రమైన నేరంగా పరిగణించి స్మిత్పై శిక్ష విధించినట్టు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ తెలిపాడు. 'మ్యాచ్లో ఆస్ట్రేలియా నాయకత్వ బృందం చేసిన పని క్రికెట్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. కెప్టెన్ స్మిత్ దీనికి పూర్తి బాధ్యత తనదే అని చెప్పడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశాం' అని రిచర్డ్సన్ పేర్కొన్నాడు.
సీఏ నిబంధనల ప్రకారం మోసానికి పాల్పడిన క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించొచ్చు. దీంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏ నిర్ణయం తీసుకుంటుందా? అని మాజీ క్రికెటర్లతో పాటు సగటు క్రికెట్ అభిమాని ఎదురు చూస్తున్నాడు.
ఇక, బాల్ టాంపరింగ్ను ప్రోత్సహించి, సహచర క్రికెటర్తో తప్పు చేయించినందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించింది. ఇక టాంపరింగ్కు పాల్పడిన బాన్క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో జత చేసింది.
దీనికి మందు క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించగా.. డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్సీ తనకు తానుగా వైదొలిగాడు. నాలుగో రోజు ఆటలో టిమ్ పెయినీ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.