సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయంపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. శుక్రవారం ఏకంగా ఆరు గంటలపై సుదీర్ఘ రివ్యూ చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్లను బీసీసీఐ ప్రశ్నలు సంధించింది. 91 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా వైట్ వాష్కు గురైన సంగతి తెలిసిందే. కివీస్తో టెస్టు సిరీస్ను 0-3తో కోల్పోయి ఈ అపకీర్తి మూటగట్టుకుంది.
అయితే ఈ ఘోరపరాజయం అనంతరమే బీసీసీఐ అనధికారిక సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మైదానంలోనే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్తో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సుదీర్ఘంగా చర్చించాడు. అనంతరం బీసీసీఐ పెద్దలతో అగార్కర్ మాట్లాడాడు. కాగా, శుక్రవారం అధికారికంగా సమీక్షించారు. గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మలతో పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్ను బీసీసీఐ ప్రశ్నించింది. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు.

మూడో టెస్టులో అలాంటి పిచ్ను ఎందుకు సిద్ధం చేశారు?
పుణె వేదికగా రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో గెలిచింది. మిచెల్ శాంట్నర్ 13 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అయితే ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మూడో టెస్టుకు గంభీర్-రోహిత్ సూచనలతో ర్యాంక్ టర్నర్ పిచ్ను సిద్ధం చేశారు. ఈ వ్యూహం దారుణంగా విఫలమైంది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 121 పరుగులకే కుప్పకూలింది. రెండో టెస్టులో స్పిన్ పిచ్లో విఫలమైనప్పటికీ మూడో టెస్టులోనూ స్పిన్ పిచ్ను ఎందుకు సిద్ధం చేశారని బీసీసీఐ సమావేశంలో ప్రశ్నించింది.
వాంఖడే టెస్టులో బుమ్రాను ఎందుకు తప్పించారు?
ఆఖరి టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. తుదిజట్టులో సిరాజ్,ఆకాశ్ దీప్కు అవకాశం ఇచ్చారు. వీరిద్దరితో తొలి ఇన్నింగ్స్లో 11 ఓవర్లే బౌలింగ్ చేయించారు. ఇక రెండో ఇన్నింగ్స్లో సిరాజ్కు కెప్టెన్ రోహిత్ బంతి అసలు ఇవ్వలేదు. ఆకాశ్ దీప్కు 5 ఓవర్లు ఇచ్చారు. అయితే మ్యాచ్ విన్నర్ బుమ్రాను పక్కనపెట్టడంపై బీసీసీఐ ప్రశ్నలు సంధించింది. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకొని బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినట్లు గంభీర్-రోహిత్ సమాధానం చెప్పారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ప్రణాళికలు ఏంటి?
ఘోర పరాజయం అనంతరం టీమిండియా తిరిగి గాడినపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని బీసీసీఐ వివరణ కోరింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఆటను ఎలా సరిదిద్దుకుంటారని అడిగింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ను 4-0తో గెలిస్తేనే ఇతర జట్లపై ఆధారపడకుండా టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరుతుంది. అయితే సమీక్షలో గౌతమ్ గంభీర్ కోచింగ్పై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.