బెంగుళూరు: అక్టోబర్ 22న చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో వన్డేలో టీమిండియా స్ఫిన్నర్ అమిత్ మిశ్రా అడతాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. గత నెలలో ఓ మహిళపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలతో అమిత్ మిశ్రాపై బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
బెంగుళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో అమిత్ మిశ్రాపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వ్యక్తిగంతా హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
బెంగుళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ సందీప్ పాటిల్ లోకల్ టీవి ఛానల్తో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్లో మహిళపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలతో అమిత్ మిశ్రాపై కేసు నమోదైందని, ఆ కాపీని బీసీసీఐకు పంపించినట్లు తెలిపారు.

దీనిపై స్పందించిన బీసీసీఐ బౌలర్ మిశ్రాపై విచారణకు బుధవారం ఆదేశించింది. దీంతో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న గాంధీ-మండేలా సిరిస్లో అక్టోబర్ 22 (గురువారం)నాడు నాల్గవ వన్డే చెన్నైలో జరగనుంది. ఈ తాజా వివాదంతో నాలుగో వన్డేలో అమిత్ మిశ్రా ఆడుతాడా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఈ వన్డే సిరిస్లో 2-1తో దక్షిణాఫ్రికా ముందంజలో ఉంది. చివరి వన్డే అక్టోబర్ 25 (ఆదివారం) ముంబైలో జరగనుంది. 32 ఏళ్ల అమిత్ మిశ్రా దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగు మ్యాచ్ల టెస్టు సిరిస్లో తొలి రెండు టెస్టు మ్యాచ్లకు కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.