కోల్కతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గురువారం సాయంత్రం యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. యాంజియోప్లాస్టీ ద్వారా రక్తానాళాల్లో పూడికలు తొలగించేందుకు అదనంగా మరో రెండు స్టెంట్లు వేసినట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని, శుక్రవారం లేదా శనివారం డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 'గంగూలీ గుండెరక్తనాళాల్లో పూడికలు తొలగించేందుకు రెండు స్టెంట్లు అమర్చాం' అని అపోలో వైద్యులు చెప్పారు.
జనవరి మొదటివారంలో సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన దాదా గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు అప్పట్లో వుడ్ల్యాండ్ హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. యాంజియోప్లాస్టీ ద్వారా సమస్య అధికంగా ఉన్నచోట ఒక స్టంట్ అమర్చారు. దీంతో గంగూలీ ఆరోగ్యం కుదుటపడడంతో మిగతా చోట్ల స్టంట్ వేయడాన్ని వాయిదా వేశారు. ఆపై దాదా కొన్ని రోజులు బాగానే ఉన్నారు.
బుధవారం కాస్త అసౌకర్యంగా అనిపించడంతో సాధారణ చెకప్ పేరిట సౌరవ్ గంగూలీ అపోలో ఆసుపత్రికి రావడంతో మరోసారి ఆందోళన నెలకొంది. గురువారం ఆయనకు వరుసగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను విశ్లేషించిన వైద్య బృందం చర్చించి స్టెంట్లు వేసేందుకు నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం మరోమారు యాంజియోప్లాస్టీ నిర్వహించి మిగతా రెండు స్టంట్స్ వేశారు. ప్రస్తుతం దాదా ఆరోగ్య పరిస్థితి అత్యంత నిలకడగా ఉంది.
గురువారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సౌరవ్ గంగూలీని పరామర్శించారు. దాదా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గంగూలీకి నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయిందని, అతని భార్య డోనా గంగూలీతో ఈ విషయం మాట్లాడినట్లు మమతా తెలిపారు. గంగూలీకి నిర్వహించిన యాంజియోప్లాస్టీ ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల బెంగాల్ సీఎం వైద్యులను అభినందించారు.
చిక్కుల్లో టీమిండియా ఓపెనర్.. వారణాసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు!!