
కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా అందులో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను కోల్కతాలోని వుడ్లాండ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజానికి గంగూలీ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే గంగూలీకి సోకింది కరోనానా? లేక కరోనాలోని ఒమిక్రాన్ వేరియంటా? అని నిర్ధారించడానికి ఆయన రక్త నమూనాలను వైద్యులు పరీక్షలకు పంపించారు.
ఈ ఏడాది ఆరంభంలో గంగూలీ కుటుంబసభ్యులు కూడా కరోనా బారినపడ్డారు. అంతేకాకుండా గతంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ఈ ఏడాది గంగూలీకి రెండు సార్లు ఛాతిలో నొప్పి వచ్చింది. జనవరి ప్రారంభంలో వ్యాయామం చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం జనవరి 28న మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో వైద్యులు ఆయనకు యాంజియోప్లాసీ శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం కరోనా సోకిన దానితో కలుపుకుంటే ఈ ఏడాది గంగూలీ ఆస్పత్రిలో చేరడం ఇది మూడో సారి.
ఈ నెల 24న గంగూలీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో టీఎంసీ ఎంపీ దేవ్, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రతోపాటు నుస్రత్, యష్, బాబుల్ సుప్రియో కూడా పాల్గొన్నారు. దీంతో గంగూలీకి అక్కడే కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ అయినా గంగూలీ అంతర్జాతీయ క్రికెట్లో అనేక మ్యాచ్లు ఆడాడు. 113 టెస్ట్ మ్యాచ్లు ఆడి 42 సగటుతో 7212 పరుగులు చేశాడు. ఇందులో 35 హాఫ్ సెంచరీలు, 16 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 239 పరుగులు. 311 వన్డే మ్యాచ్లు ఆడిన 41 సగటుతో 11363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 183 పరుగులు. గంగూలీ కెప్టెన్గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. భారత జట్టును ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఇక ఐపీఎల్లో 59 మ్యాచ్లు ఆడిన గంగూలీ 25 సగటుతో 1349 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 91 పరుగులు.