
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దుబాయ్ బయలుదేరారు. పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీ సన్నాహాలను గంగూలీ దగ్గరుండి పరిశీలించనున్నారు. బుధవారం దాదా ప్రత్యేక విమానంలో దుబాయ్కి బయల్దేరారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.
'ఐపీఎల్ 2020 కోసం దుబాయ్ వెళ్తున్నాను. ఆరు నెలల్లో ఇదే నా మొదటి విమాన ప్రయాణం. జీవితంలో వచ్చిన మార్పులు క్రేజీగా ఉన్నాయి' అంటూ సౌరవ్ గంగూలీ ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానం ముందు దిగిన ఓ ఫొటోను కూడా గంగూలీ షేర్ చేశారు. ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో ఐపీఎల్ 2020 జరగనుంది.
మార్చిలో మొదలవ్వాల్సిన ఐపీఎల్ 2020 కరోనా వైరస్ కారణంగా నిరవధిక వాయిదా పడింది. రూ.4000 కోట్ల విలువైన సీజన్ను నిర్వహించేందుకు బీసీసీఐ ఎంతో శ్రమించింది. సరైన విండో కోసం ఎదురుచూసింది. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ వాయిదా పడటంతో.. ఆ విండోలో ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. ఇక భారత్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో యూఏఈలో టోర్నీ నిర్వహిస్తున్నారు.
ఆగస్టు 20 తర్వాత ఫ్రాంచైజీలన్నీ దుబాయ్, అబుదాబికి చేరుకోగా వారం రోజులు బాగానే గడిచింది. అయితే చెన్నై సూపర్కింగ్స్ బృందంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి వైరస్ సోకడం, స్టార్ సిబ్బంది, బీసీసీఐ సిబ్బందికీ కొవిడ్-19 రావడం కలకలం సృష్టించింది. సీనియర్ ఆటగాళ్లైన సురేష్ రైనా, హర్భజన్ సింగ్ దూరమవ్వడం సందిగ్ధానికి తావిచ్చింది. పూర్తి షెడ్యూలును ప్రకటించేందుకూ బీసీసీఐ చాలా సమయం తీసుకుంది.
ప్రస్తుతం అన్ని సర్దుకోవడంతో గత ఆదివారం ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదలైంది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగుతున్నారు. మిగిలిన వ్యవహారాలను ఆయన చక్కదిద్దుతారని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్, మరికొందరు అధికారులు దుబాయ్ చేరుకున్న సంగతి తెలిసిందే.