
నాలుగు సంవత్సరాలపాటు వన్డే, టీ20 ఫార్మాట్కు ఎంపిక చేయని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను అనూహ్య రీతిలో 2021 టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేశారు. దీంతో అంతా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పట్లో అశ్విన్ ఎంపికపై అంతా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చివరగా 2017లో భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన అశ్విన్కు ఆ తర్వాత మళ్లీ అవకాశం దక్కలేదు. యువ స్పిన్నర్లైనా యజుర్వేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్ క్రమంగా తప్పకుండా రాణిస్తుండడంతో సెలెక్టర్ల అశ్విన్ను పక్కనపెట్టారు. వాళ్ల దూకుడు ముందు అశ్విన్ సత్తా చిన్నదైపోయింది.
అయితే నాలుగేళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ 2021లో అనూహ్యంగా చోటు సంపాదించుకున్నాడు అశ్విన్. తాజాగా దీనికి గల కారణాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరించాడు. అప్పటి టీమిండియా టీ20 కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచకప్ జట్టులో ఉండాలని కోరుకున్నాడని, అందుకే అశ్విన్ను జట్టులోకి ఎంపిక చేసినట్టు ఆయన తెలిపాడు. నిజానికి అశ్విన్ను వరల్డ్కప్నకు ఎంపిక చేస్తున్నట్టు తనకు ముందుగా తెలియదని, ఎంపిక చేశాక ఆశ్చర్యానికి గురైనట్టు గంగూలీ చెప్పాడు. అయితే చాహల్, కుల్దీప్ యాదవ్ వరుసగా విఫలం కావడం ఆ సమయంలో అశ్విన్ టెస్ట్ ఫార్మాట్తోపాటు ఐపీఎల్లోనూ నిలకడగా రాణిస్తుండడం కూడా అతనికి కలిసి వచ్చింది.
వచ్చిన అవకాశాన్ని అశ్విన్ అద్బుతంగా వినియోగించుకున్నాడని అశ్విన్పై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అశ్విన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నాడు. ప్రతి ఒక్కరు అశ్విన్ గురించే మాట్లాడుతున్నారని ఆయన కొనియాడాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత అశ్విన్ను ఆల్ టైం గ్రేట్ క్రికెటర్గా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశసించాడని గంగూలీ గుర్తు చేశాడు. అశ్విన్ ప్రతిభను గుర్తించడానికి రాకెట్ సైన్స్ అవసరం లేదన్న గంగూలీ.. అతని రికార్డులే అతని గురించి చెబుతాయన్నాడు. తన ప్రశంసలు అనేవి తాను చూసిన దాని నుంచే వస్తాయని ఈ సందర్బంగా గంగూలీ చెప్పుకొచ్చాడు. అది రోహిత్ శర్మ అయినా, శ్రేయస్ అయ్యరైనా, విరాట్ కోహ్లీ అయినా ఇంకేవరైనా అని గంగూలీ పేర్కొన్నాడు.
కాగా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న అశ్విన్ టీ20 వరల్డ్కప్తోపాటు ఆ తర్వాత కివీస్తో జరిగిన సిరీస్లోనూ సత్తా చాటాడు. ఇప్పటివరకు భారత్ తరఫున అశ్విన్ 81 టెస్టుల్లో 427 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు, 51 టీ20ల్లో 61 వికెట్లు పడగొట్టాడు.