
లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సి) రెండో ఎడిషన్లో తాను ఆడబోతున్నట్లు వచ్చిన వార్తలను భారత మాజీ కెప్టెన్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఖండించారు. గంగూలీ సైతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడతాడంటూ వచ్చిన ప్రకటనపై గంగూలీ వివరణ ఇచ్చాడు. ఇంతకుముందు ఎల్ఎల్సి నిర్వాహకులు ఒక పత్రికా ప్రకటనలో.. 'ఇతర దిగ్గజాలతో ఆడటం చాలా సరదాగా ఉంటుంది అని గంగూలీ పేర్కొన్నట్లు ప్రస్తావించగా.. సదరు ప్రస్తావనను గంగూలీ తోసిపుచ్చాడు. రెండో ఎడిషన్లో పాల్గొనడం లేదని, అవన్నీ గాలి వార్తలని కొట్టిపారేశాడు.
సౌరవ్ గంగూలీ ఎన్డీటీవీతో ఈ మేరకు మాట్లాడుతూ.. 'నో, నేను లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడట్లేదు. ఆ వార్త నిజం కాదు.' అని స్పష్టం చేశాడు. ఇకపోతే గంగూలీ ఆడకపోయినా.. చాలా మంది ప్రముఖ క్రికెటర్లు లెజెండ్స్ లీగ్లో కన్పించబోతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముత్తయ్య మురళీధరన్, మాంటీ పనేసర్ తదితరులు తాము లెజెండ్స్ లీగ్ ఆడనున్నారు. అలాగే హర్భజన్ సింగ్, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రాఫ్ మొర్తజా, దినేష్ రామ్దిన్, లెండిల్ సిమన్స్ సైతం రెండో ఎడిషన్కు అందుబాటులోకి రాబోతున్నారు. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా మాట్లాడుతూ.. హర్భజన్ గతేడాది జనవరిలో కోవిడ్ కారణంగా తొలి సీజన్లో మిస్సయ్యాడు. ఇప్పుడు అతను లీగ్లోకి రావడం సంతోషంగా ఉంది. మైదానంలో అతని స్పిన్ మాయాజాలాన్ని మరోసారి చూడాలని ఎదురుచూస్తున్నాము.' అని పేర్కొన్నాడు.