
షాహిద్ అఫ్రిదీ షాకింగ్ కామెంట్స్
అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ తప్పుబట్టాడు. ఐసీసీ కావాలనే బీసీసీఐకి మద్దతునిస్తోందని, ఎలాగైనా ఆ జట్టును సెమీస్ చేర్చాలని ప్రయత్నిస్తోందని అఫ్రిదీ ఆరోపించాడు. భారత్ ఆడే మ్యాచులకు భారీగా డబ్బులు వస్తాయని, అందుకే ఐసీసీ ఎలాగైనా ఆ జట్టును సెమీస్ చేర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నాడు. పాకిస్తాన్తో భారత్ ఆడిన మ్యాచ్లో చివరి ఓవర్లో అంపైర్లు నోబాల్ ఇవ్వడంపై ఆ జట్టు, అభిమానులు ఇంకా అసంతృప్తిగానే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఫ్రిదీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఆరోపణలు సమంజసం కాదు..
అఫ్రిదీ ఆరోపణలపై బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఒక ఫంక్షన్లో పాల్గొన్న బిన్నీ.. సందర్భంగా అఫ్రిదీ వ్యాఖ్యలపై పెదవి విప్పాడు. 'ఈ ఆరోపణలు సమంజసం కాదు. ఐసీసీ మాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని నేను అనుకోవడం లేదు. అందరి విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంది. ఇలా పక్షపాతం చూపిస్తోందని ఏ విధంగానూ అనలేం. మిగతా జట్లతో పోలిస్తే మాకు అదనంగా ఎలాంటి సహకారం లభిస్తోంది చూపించండి? క్రికెట్లో భారత్ పవర్ హౌస్ జట్టే.. కానీ మేమందంరం సమానంగానే పరిగణించబడతాం' అని స్పష్టం చేశాడు.

అంపైర్ల నిర్ణయాలు..
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో అంపైర్లు నోబాల్ ఇచ్చారు. అది నోబాల్ కాదని సోషల్ మీడియాలో పాక్ అభిమానులు తెగ కామెంట్లు చేశారు. కానీ అది ఎందుకు నోబాల్ అని వివరిస్తూ భారత అభిమానులు కూడా వివరణలు ఇచ్చారు. అలాగే బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో వర్షం ఆగిన తర్వాత కాసేపటికే మ్యాచ్ ప్రారంభమైంది. మైదానం చిత్తడిగా ఉందని బంగ్లా కెప్టెన్ చెప్పినా అంపైర్లు మ్యాచ్ ప్రారంభించడాన్ని కూడా బంగ్లా, పాక్ అభిమానులు తప్పుబట్టారు. ఇదే మ్యాచ్లో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లా జట్టు సభ్యుడు నురుల్ హసన్ వెల్లడించాడు. దీన్ని గమనించడంలో కూడా అంపైర్లు విఫలమయ్యారు. అంపైర్లు కావాలనే భారత్కు సహకారం అందిస్తున్నారని విమర్శలు చేశారు.


Click it and Unblock the Notifications












