కోల్కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి గుండె సంబంధిత సమస్యతో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. 1979 నుంచి ఆయన బిసిసిఐకి సేవలందిస్తూ వస్తున్నారు. 1983లో ఆయన బిసిసిఐ కోశాధికారిగా పనిచేశారు
భారత క్రికెట్కు పునాదులు వేసినవారిలో చెప్పుకోదగిన వ్యక్తి జగ్మోహన్ దాల్మియా. 1997లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిసిసిఐని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఆయనది కీలకమైన పాత్ర.

మూడు రోజుల క్రితం ఛాతీ నొప్పితో దాల్మియా గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బిఎం బిర్లా ఆస్పత్రిలో చేరారు. ఆయన గురువారం రాత్రి ఆండియోగ్రఫీ జరిగింది. రెండు రోజుల పాట వైద్యులు దగ్గరుండి ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఆ రెండు రోజుల పాటు నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం ఆదివారం రాత్రి విషమించింది.
నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణపై బిసిసిఐ నుంచి ఆయన 2006లో ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత 2013లో ఎన్. శ్రీనివాసన్ పక్కకు జరగాల్సి రావడంతో 2013 జూన్లో ఆయన బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అల్లుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో శ్రీనివాసన్ బిసిసిఐ అధ్యక్ష పదవికి దూరం కావాల్సి వచ్చింది.
జగ్మోహన్ దాల్మియా 1940 మే 30వ తేదీన పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. దాల్మియా మొదటగా బీసీఏ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత 1970లో బీసీసీఐ బోర్డులో సభ్యునిగా చేరారు.
కాలేజీ రోజుల్లో ఆయన వికెట్ కీపింగ్పై మక్కువ చూపేవారు. వికెట్ కీపర్గా కోల్కతాలోని పలు క్లబ్లకు ఆడారు. ఆ తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఎంఎల్ దాల్మియా కంపెనీని ఏర్పాటు చేశారు. నిర్మాణ రంగంలో దేశీయంగా ముఖ్యమైన కంపెనీల్లో ఒక్కటిగా అది పేరు సంపాదించుకుంది. ఆయన రెండు సార్లు బిసిసిఐ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారి 2001 నుంచి 2004 వరకు పనిచేశారు. భారత క్రికెట్ రాజకీయాల్లో ఆయన మ్యాకీవెల్లీగా పరిగణనలోకి వచ్చారు.