కోల్కత్తా: ప్రపంచంలో కెల్లా బీసీసీఐని అత్యంత ధనికబోర్డుగా మార్చిన ఘనత జగ్మోహన్ దాల్మియాది. అలాంటి జగ్మోహన్ దాల్మియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 35 ఏళ్ల తన క్రీడా కెరీర్లో ఎన్నో ఎత్తు పళ్లాలను జగ్మోహన్ దాల్మియా చవిచూశాడు.
1978లో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కోశాధికారిగా కెరీర్ ఆరంభించిన దాల్మియా 1983 బీసీసీఐ కోశాధికారిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత బోర్డు కార్యదర్శిగా పనిచేశాడు. 1987, 1996 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు భారత్ ఉపఖండంలో జరగడంలో కీలకపాత్ర పోషించాడు.
1997లో ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో వరల్డ్ క్రికెట్కు భారత్ కేంద్రంగా మారింది. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ బోర్డు ఒక బలమైన, సంపన్నమైన బోర్డుగా అవతరించేలా చేశాడు. వరల్డ్ క్రికెట్ గతినే మార్చేశాడు.

1990ల్లో దాల్మియా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి బీసీసీఐ రూ. 81.60 లక్షల లోటు బడ్జెట్లో ఉంది. అదే సంవత్సరం రూ. 100 కోట్లకుపైగా టర్నోవర్ సాధించి ప్రపంచంలోనే సంపన్న బోర్డుగా అవతరించింది.
టీవీ హక్కుల వివాదంలో 2000లో ఐసీసీ నుంచి బయటకు వచ్చిన దాల్మియా 2001లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004 వరకు ఆ హోదాలో కొనసాగారు. 2005 ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం చేతిలో ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత వరల్డ్ కప్ సమయంలో ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆ తర్వాతి ఏడాది అతడిని బోర్డు నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత కాలంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం యావత్ దేశాన్ని కుదేపినప్పుడు బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.
పేరు: జగ్మోహన్ దాల్మియా
పుట్టినరోజు: మే 30, 1940
పుట్టిన స్థలం: కోల్కత్తా, ఇండియా
1978: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కార్యదర్శిగా
1983: బీసీసీఐ కోశాధికారిగా
1993: క్యాబ్ అధ్యక్షుడిగా
1997: ఐసీసీ అధ్యక్షుడిగా
2000: ఐసీసీ ఛైర్మన్ పదవిని వదులుకున్నాడు
2001: బీసీసీఐ అధ్యక్షుడిగా
2005: బీసీసీఐ అధ్యక్షుడిగా ముగింపు
2006: ఆర్ధిక ఆరోపణలతో బీసీసీఐ నుంచి బహిష్కరణ
2006: క్యాబ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక
2007: క్యాబ్ అధ్యక్షుడిగా రాజీనామా
2013: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నిక
2015: 10ఏళ్ల విరామం తర్వాత మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక
2015: సెప్టెంబర్ 20 (ఆదివారం) కన్నుమూత