రంజీ ట్రోఫీ షెడ్యూల్
కాగా ఈ రంజీ ట్రోఫీ 2022 ఈ నెల 13 నుంచి మార్చి 20 వరకు 2 నెలలపాటు జరగనుంది. మొత్తం 5 వేదికలలో నిర్వహించనున్నారు. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు కోల్కతా, ముంబై, అహ్మదాబాద్, తిరువనంతపురం, చెన్నైలో జరగనుండగా.. నాకౌట్ దశ మ్యాచ్లు కోల్కతాలో జరుగుతాయి.
కఠిన నిబంధనలు
టోర్నీని కఠిన కరోనా నిబంధనల మధ్య నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారులు తెలిపారు. ఆటగాళ్లు, ఇతర సిబ్బంది సురక్షితంగా ఉండడానికి కఠిన బయోబబుల్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రోటోకాల్ అమలు చేస్తున్నామని, జనవరి 8 నాటికి అన్ని టీమ్లు బయోబబుల్లోకి వస్తాయని తెలిపారు. అలాగే టోర్నమెంట్ సాగే రోజుల్లో ప్రతి రోజు ఆటగాళ్లు, వారి సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రంజీలో కరోనా కలకలం
రంజీ ట్రోఫి ప్రారంభానికి ముందే పలు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం నిర్విహించిన టెస్టుల్లో బెంగాల్ జట్టుకు చెందిన ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఆరుగురు క్రీడాకారులు ఉండగా.. ఒకరు కోచింగ్ సిబ్బంది ఉన్నారు. అలాగే ముంబై జట్టుకు చెందిన ఆల్రౌండర్ శివమ్ దూబే కూడా వైరస్ బారినపడ్డాడు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా కూడా కరోనా బారిన పడ్డాడు.
కోలుకుంటున్న గంగూలీ
ఇటీవల కరోనా బారిన పడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ హోంక్వారంటైన్లో కోలుకుంటున్నారు. ఆయనకు సోకింది డెల్టా వేరియంట్ కావడంతో వైద్యులు హోంక్వారంటైన్లో తగిన చికిత్స అందిస్తున్నారు. మొదట్లో ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం హొంక్వారంటైన్లోనే అందిస్తున్నారు.