టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జింబాబ్వే పర్యటనకు సిద్ధమైంది. జులై 6వ తేదీ నుంచి జింబాబ్వేతో భారత్ అయిదు టీ20ల సిరీస్ ఆడనుంది. భవిష్యత్ స్టార్లను సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడంతో పాటు బెంచ్ బలాన్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో యువ ఆటగాళ్లను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశారు. ఈ యువ టీమ్ను శుభ్మన్ గిల్ నడిపించనున్నాడు. హరరే వేదికగా శనివారం తొలి టీ20 మ్యాచ్ జరనుంది. ఆదివారం రెండో మ్యాచ్, జులై 10, జులై 13, జులై 14వ తేదీల్లో చివరి మూడు టీ20లు జరగనున్నాయి.

అయితే జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టు నుంచి యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్, శివమ్ దూబె, ఖలీల్ అహ్మద్,రింకూ సింగ్ ఆటగాళ్లను తప్పించే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ అయిదుగురు ఆటగాళ్లు ప్రస్తుతం వెస్టిండీస్లోనే ఉన్నారు. దూబె, సంజు శాంసన్, జైస్వాల్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుతో ఉండగా, రింకూ, ఖలీల్ రిజర్వ్ ప్లేయర్లుగా టీమిండియాతోనే ఉన్నారు. కాగా, ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చిన వెస్టిండీస్లో తుఫాను పంజా విసురుతోంది.
ఫైనల్ జరిగిన బార్బడోస్తో పాటు సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్ దీవులపై హరికేన్ ప్రతాపం చూపుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ విమాన రాకపోకలు స్థంభించాయి. దీంతో భారత జట్టుతో ఉన్న ఈ అయిదుగురు ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి మరింత ఆలస్యమయ్యేలా ఉంది. అంతేగాక వరుస ప్రయాణాలతో ఆటగాళ్లు అలసిపోతారని బీసీసీఐ భావిస్తోంది. దీంతో జైస్వాల్, శాంసన్, దూబె, ఖలీల్,రింకూలను జింబాబ్వే పర్యటన నుంచి తప్పించి ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే.