
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఆదివారం అంటే మే 29వ తేదీన అహ్మదాబాద్ నగరంలోని మోతేరా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ రాత్రి 7.30కు ప్రారంభం కావాలి. కానీ బీసీసీఐ మ్యాచ్ టైమింగ్స్లో మార్పు చేయనుంది. ఫైనల్ మ్యాచ్ ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ప్రకారం.. రాత్రి 8PMకి ప్రారంభం కానుంది. అరగంట లేటుగా ఫైనల్ మ్యాచ్ను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. ఇందుకు కారణం లేకపోలేదు.
క్రిక్బజ్ ప్రకారం.. ఈ సీజన్ ముగింపు రోజున అదనపు సాంస్కృతిక కార్యక్రమాలతో ఫైనల్ మ్యాచ్ను వేడుకలా నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. బీసీసీఐ, ఐపీఎల్ అధికారుల నుండి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు.
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముగింపు వేడుకను సాయంత్రం 6:30కు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో బాలీవుడ్ నటీనటులు తమ ఆటపాటలతో అలరించనున్నారు. సుమారు 50నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక రాత్రి 7:30గంటలకు ఫైనల్ కంటెండర్స్ జట్ల కెప్టెన్లు గ్రౌండ్లోకి బాణాసంచాల నడుమ వస్తారు. ఇద్దరి మధ్య టాస్ నిర్వహిస్తారు. అనంతరం 30నిమిషాల తర్వాత 8గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఇకపోతే మే 22న ఆదివారం ఐపీఎల్ లీగ్ దశ ముగుస్తుంది. ప్లేఆఫ్ వెళ్లే జట్లేవో ఇంటికి వెళ్లే జట్లేవో తెలిసిపోతుంది. ఇప్పటికే కేకేఆర్, చెన్నై, ముంబై లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టగా.. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లేఆఫ్ కు చేరుకున్నాయి.
ఇక రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 2స్థానాల కోసం హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇకపోతే నాలుగు మ్యాచ్ల ప్లే-ఆఫ్లు కోల్కతా, అహ్మదాబాద్లలో జరుగుతాయి. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లు మే 24, 25తేదీల్లో కోల్ కతాలో జరుగుతాయి. చివరి రెండు మ్యాచ్లు క్వాలిఫైయర్ 2, ఫైనల్ అహ్మదాబాద్లో జరుగుతాయి.