ఈ ఏడాది బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ నేతృత్వంలో టీమిండియాను చైనా పంపాలని డిసైడ్ అయిందట. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు అదే సమయంలో ఆసియా క్రీడలు కూడా జరుగుతాయి. చైనాలోని హాంగ్జో వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ ఛాంపియన్షిప్లో భాగంగా క్రికెట్ టోర్నీ కూడా జరుగుతుంది.
ఈ క్రీడలు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరుగుతాయి. అదే సమయంలో అంటే అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ మొదలవుతుంది. ఈ రెండు టోర్నీల్లో భారత జట్టు పాల్గొనడం కష్టం. అందుకే చైనాకు భారత్-బి జట్టును పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టీంకు శిఖర్ ధవన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తాడని సమాచారం. గతంలో కూడా భారత్-బి జట్టుకు ధవన్ కెప్టెన్సీ చేసిన సంగతి తెలిసిందే.

ఇంతకుముందు కూడా ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలు జరిగాయి. కానీ బీసీసీఐ తమ జట్టును ఈ పోటీలకు పంపలేదు. ఈసారి భారత పురుషుల బి-టీంతోపాటు మహిళల జట్టును కూడా పంపాలని బీసీసీఐ డిసైడ్ అయిందట. మహిళల జట్టుకు కీలకమైన టోర్నీలేవీ ఈ సమయంలో లేవు. దీంతో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని మహిళల జట్టు ఈ పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అయింది.
ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ టోర్నీ జరుగుతుంది. ఈ క్రమంలోనే భారత్-బి జట్టులో ధవన్తో పాటు యువ ప్లేయర్లు పృథ్వీ షా, రింకూ సింగ్, తిలక్ వర్మ వంటి వారిని చైనా పంపాలని బీసీసీఐ అనుకుంటోందట. ఇది కచ్చితంగా తమ కుర్రాళ్లకు సత్తా నిరూపించుకునే అవకాశం అని మాజీలు అంటున్నారు. ఆసియా క్రీడల్లో కనుక స్వర్ణం సాధిస్తే ధవన్ కెరీర్లో కూడా అరుదైన ఘనత చేరుతుందని నిపుణుల అభిప్రాయం.