అఫ్గానిస్థాన్ సిరీస్లో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబెకు త్వరలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. వారిద్దరి పేర్లను సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చేర్చాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. 2023-24 సీజన్ కోసం 26 మంది ఆటగాళ్లకు గతేడాది మార్చిలో బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో జైశ్వాల్, దూబె పేర్లను చేర్చాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న అఫ్గానిస్థాన్ సిరీస్లో ఈ యువ ప్లేయర్లు సత్తాచాటుతున్నారు. తొలి మ్యాచ్లో అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన జైశ్వాల్ రెండో టీ20లో మెరపు ప్రదర్శన చేశాడు. 34 బంతుల్లో 68 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆది నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. అయిదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో సత్తాచాటాడు. టీ20 ప్రపంచకప్లో కూడా రోహిత్కు జతగా జైశ్వాల్ను పంపించే యోచనలో ఉన్నారు. రైట్- లెఫ్ట్ హ్యాండర్స్ జోడీని ఓపెనింగ్ భాగస్వామానికి ప్రాధాన్యత ఇస్తామని ద్రవిడ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.

గతేడాది జులైలో యశస్వీ జైశ్వాల్ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు నాలుగు టెస్టులు, 16 టీ20లు ఆడాడు. మరోవైపు శివమ్ దూబె సంచలన ప్రదర్శనలతో సత్తాచాటుతున్నాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. తొలి మ్యాచ్లో 40 బంతుల్లో 60 పరుగులు చేశాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 9 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ అర్ధశతకంతో చెలరేగాడు. 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మూడు ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీశాడు. రెండు మ్యాచ్ల్లోనూ దూబె నాటౌట్గా నిలవడం విశేషం.
అయితే దూబె 2019లోనే అరంగేట్రం చేసినా ఇప్పటివరకు 20 టీ20లే ఆడాడు. కరోనా లాక్డౌన్ తర్వాత అతడు టీమిండియా నుంచి పిలుపు కోసం మూడేళ్ల పాటు ఎదురుచూశాడు. మొత్తంగా వన్డే వరల్డ్ కప్ ముందు బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్ సిరీస్కు ఎంపిక అయ్యాడు. కానీ ఆ తర్వాత కూడా దూబె జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు వరుస మెరుపు అర్ధశతకాలతో హార్దిక్కు ప్రత్యామ్నాయంగా మారాడు. జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్కు హార్దిక్కు బ్యాకప్గా దూబెను సిద్ధం చేస్తున్నారు.