IPL Expansion: కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడే బ్యాటర్లు, బంతులతో మాయ చేసే బౌలర్లు.. ఔరా అనిపించే ఫీల్డర్లు.. ఇలా క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ధనాధన్ పండగ ఐపీఎల్. వేసవిలో అంతులోని వినోదాన్ని పంచుతూ.. రెండు నెలల పాటు సంబరాల్లో ముంచెత్తే ఈ ఐపీఎల్.. ఇకపై మరింత ఎక్కువ వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఈ దిశగా ఐపీఎల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం 74 మ్యాచులతో రెండు నెలలు పాటు సాగే ఈ మెగా టోర్నీని విస్తరించేందుకు సన్నాహాలు ప్రారంభించారు ఐపీఎల్ నిర్వాహాకులు. మరో 20 మ్యాచులు పొడిగించి, మొత్తంగా 94 మ్యాచులు, మూడు నెలల పాటు నిర్వహించేలా ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఐపీఎల్ 2028 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. బీసీసీఐ, ఐసీసీతో దీనిపై చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. "ఇది ఒక మంచి అవకాశంగా మారొచ్చు. ఐసీసీ, బీసీసీఐతో చర్చిస్తున్నాం. ఈ విషయంపై మరింత ఎక్కువగా చర్చించాలి." అని ఛైర్మన్ అరుణ్ అన్నారు.

వాస్తవానికి 2022లో రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జాయిన్ అవ్వడంతో మ్యాచులు సంఖ్య 74కి చేరింది. ఆ తర్వాత మళ్లీ 2025లో 84 మ్యాచులు నిర్వహించాలని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ఎందుకంటే షెడ్యూలింగ్ సమస్యలు, డబుల్ హెడ్డర్ల (ఒకే రోజున రెండు మ్యాచ్లు) ఎక్కువైపోతాయని బ్రాడ్కాస్టర్ల నుంచి ఆందోళనలు వినిపించాయి. అందుకే ఈ మ్యాచుల సంఖ్య పొడిగింపు వాయిదా పడింది.
కాగా, వచ్చే రెండు సీజన్లలో మిడ్ మార్చ్ నుంచి మిడ్ మే వరకు ఐపీఎల్ షెడ్యూల్ తేదీలు ఇప్పటికే ఖరారైపోయాయి. అయితే ఐపీఎల్ మరిన్ని రోజులకు విస్తరిస్తే.. అంతర్జాతీయ క్యాలెండర్ పై ప్రభావం చూపుతుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.