రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్ దాదాపు ఏడాది నుంచి క్రికెట్కు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకున్న అనంతరం నడవడానికే కష్టపడిన పంత్.. పరుగులు పెడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని NCAలో కోలుకుంటున్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో పంత్ పూర్తి ఫిటెనెస్ సాధించేలా ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్కే అందుబాటులో ఉండేలా సిద్ధమవుతున్నాడు.
అయితే ఇంగ్లాండ్ సిరీస్కు ముందే పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించినా అతడిని కొన్నినెలలు పక్కన పెట్టాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. స్వదేశంలో జనవరి 11 నుంచి టీమిండియా అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వారానికే ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ మార్చి 11 వరకు జరుగుతుంది.

ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపిక చేస్తే పంత్పై భారం పెరుగుతుందని బీసీసీఐ ఆలోచిస్తుంది.గతంలో బుమ్రా విషయంలో తీసుకున్న జాగ్రత్తలే పంత్ విషయంలోనూ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా వన్డే ప్రపంచకప్ ముందు ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. పునరాగమనంలో నేరుగా వన్డే, టెస్టులకు ఎంపిక చేస్తే గాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పొట్టి ఫార్మాట్ సిరీస్కు ఎంపిక చేశారు.
అదే రీతిలో పంత్ను కూడా తిరిగి టీమిండియాలోకి తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. జట్టులో కీలక ప్లేయర్ అయిన పంత్ టీ20 ప్రపంచకప్ ప్రణాళికలో ఉండేలా ప్లాన్ చేస్తోంది. అందుకే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు ముందు పంత్ సిద్ధమైనా అతడు వెయిట్ చేయాల్సిందే. వచ్చే ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే పంత్ ఐపీఎల్లో ఆడాలా వద్దా అనేది ఎన్సీఏ ఇచ్చే రిపోర్ట్పై ఆధారపడి ఉంది.
కాగా, రోడ్డు ప్రమాదంలో పంత్ మోకాలి, చీలమండలానికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి పంత్ టీమిండియా ఆడిన 62 మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే మరో వారం రోజుల్లో పంత్ మునపటిలా పూర్తిస్థాయిలో పరిగెత్తే అవకాశాలు ఉన్నాయని సమాచారం.