
ప్రస్తుతం బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ముందున్న ప్రధాన సమస్య కొత్త సెలెక్షన్ కమిటీ ఎంపిక. బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు బిన్నీ ప్రకటించాడు. దీంతో కొత్త వాళ్లకు సెలెక్షన్ కమిటీలో చోటు దొరుకుతుందని, తద్వారా చేతన్ శర్మ అండ్ కో నిర్లక్ష్యం చేసిన నాణ్యమైన ఆటగాళ్లకు కూడా న్యాయం జరుగుతుందని అంతా అనుకున్నారు.
అయితే కొత్త సెలెక్షన్ కమిటీ కోసం నెల రోజులుగా బీసీసీఐ దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉంది. కానీ ఒక్కరంటే ఒక్క పెద్ద పేరున్న వ్యక్తి కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయకపోవడం గమనార్హం. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్కు జీతం రూ.1.25 కోట్లుకాగా.. కమిటీ సభ్యులకు రూ.కోటి రూపాయల జీతం అందుతుంది. అయినా ఈ ఉద్యోగానికి మాజీ దిగ్గజాలు ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఎవరో ఒకరైనా అలాంటి వాళ్లను సెలెక్షన్ కమిటీలో భాగస్వాములు చేయాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. కానీ ప్రస్తుతానికైతే అది జరిగేలా లేదు.
ఈ నేపథ్యంలోనే క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులంతా గురువారం నాడు ముంబైలో కలుస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సెలెక్షన్ కమిటీ పదవుల కోసం దరఖాస్తు చేసిన వారిలో షార్ట్ లిస్ట్ అయిన వారిని ఈ కమిటీ సభ్యులు ఇంటర్వ్యూ చేయనున్నారు. అయితే కొత్త సెలెక్షన్ కమిటీకి కూడా చేతన్ శర్మనే చైర్మన్గా ఉండే అవకాశం ఉందని, లేదంటే కొత్త చైర్మన్ కింద సభ్యుడిగా చేతన్ శర్మ పనిచేసే ఛాన్సులు కూడా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. ఈ కారణంగానే అతను మళ్లీ చేసిన దరఖాస్తును బీసీసీఐ స్వీకరించిందని, ఎలాంటి హామీ లేకపోతే అతను ఎందుకు దరఖాస్తు చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతానికైతే చేతన్ శర్మ బృందమే శ్రీలంక సిరీస్కు కూడా జట్టును ఎంపిక చేసింది.