
సెకెండ్ వేవ్తో గట్టి దెబ్బ..
టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్.. నిజానికి గత ఏడాదే ఆరంభం కావాల్సి ఉంది. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ దీన్ని వాయిదా వేసింది. సానుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడే ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తామని తెలిపింది. ఇప్పుడా వాతావరణం దేశంలో లేనే లేదు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. మరింత కల్లోలాన్ని రేపుతోంది. ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే.. అటు రోజువారీ పాజిటివ్ కేసులు.. ఇటు మరణాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తోన్న పాజిటివ్ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు పైగా ఉంటోంది. మూడువేల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు.

అక్టోబర్ నాటికి..
ఈ పరిణామాల మధ్య దేశంలో టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ను నిర్వహించడం సాధ్యం కాదని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్లో ఈ మెగా క్రికెట్ ఈవెంట్ ఆరంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రారంభం అయ్యే సమయానికి ఇప్పుడున్న కరోనా సంక్షోభ పరిస్థితులు తగ్గుముఖం పడతాయో.. లేదో తెలియట్లేదు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో దేశం కొనసాగినప్పటికి కూడా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ను మాత్రం వాయిదా వేయకూడదని బీసీసీఐ నిర్ణయించుకుంది. తటస్థ వేదికపైన చేపట్టాలని భావిస్తోంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో
దీనికోసం ప్లాన్-బీని అమలు చేయనుంది. ఇందులో భాగంగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ టోర్నమెంట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టకపోతే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దీన్ని నిర్వహిస్తామని బీసీసీఐ జనరల్ మేనేజర్ ఆఫ్ గేమ్ డెవలప్మెంట్ ధీరజ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బీబీసీ స్టంప్డ్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారాయన. ప్రస్తుతం తాము టీ20 ప్రపంచకప్ టికెట్ల విక్రయాలపై దృష్టి పెట్టామని, అక్టోబర్ నాటికి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని అంచనా వేయలేకపోతున్నామని అన్నారు.

ఐపీఎల్ 2020 సక్సెస్ఫుల్..
గత ఏడాది ఐపీఎల్ సీజన్ మ్యాచ్లన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే నిర్వహించిన విషయం తెలిసిందే. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, షార్జా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాల్లో ఐపీఎల్ 2020 మ్యాచ్లను నిర్వహించారు. ఆ సీజన్ మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ తటస్థ వేదికపై ఓ మెగా ఈవెంట్ను సజావుగా నిర్వహించగలిగింది బీసీసీఐ. ఇప్పుడు కూడా అవే స్టేడియాలను వేదికగా చేసుకుని టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసేలా ప్లాన్ బీని రూపొదించుకున్నట్లు ధీరజ్ మల్హోత్రా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications
