
అంతర్జాతీయ స్థాయిలో టీమిండియాను రిప్రజెంట్ చేసే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. కానీ అక్కడి వరకు వెళ్లిన చాలా మంది ఆటగాళ్లు గాయాలపాలై జట్టుకు దూరం అవుతున్నారు. దీంతో ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్మెంట్ కోసం వాళ్లకు ఎక్కువగా విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించింది. ఇదే పద్ధతిని కంటిన్యూ చేసింది కూడా. అయితే గంగూలీ హయాంలో అమలు చేసిన ఈ విధానానికి బీసీసీఐ కొత్త అధ్యక్షుడు మంగళం పాడినట్లు తెలుస్తోంది. ఇకపై టీమిండియా ఆటగాళ్లు అయినా సరే బ్రేక్లో ఉంటే కచ్చితంగా రంజీలు తదితర దేశవాళీల్లో ఆడాలని చెప్పేసిందట.
ఆటగాళ్లు మ్యాచ్ ఫిట్నెస్ సాధించకపోవడం వల్లనే ఇంతమంది ప్లేయర్లు గాయాల బారిన పడినట్లు బీసీసీఐ భావిస్తోంది. అందుకే వారిని దేశవాళీల్లో ఆడాలని చెప్పిందట. అయితే మూడు ఫార్మాట్లలో టీమిండియా తరఫున ఆడే ఆటగాళ్లకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లు కూడా రంజీ బరిలో దిగారు. ఈ రంజీ ట్రోఫీ తొలి దశలో ఇషాన్ కిషన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే ముంబై ఆడిన తొలి మ్యాచ్లో ఆడని సూర్యకుమార్ యాదవ్.. రెండో మ్యాచ్లో బరిలో దిగుతున్నాడు. ఇప్పుడు అందరి కళ్లూ ఈ టీ20 స్పెషలిస్టు మీదనే ఉన్నాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలని భారత్ కష్టపడుతోంది. ఇలాంటి సమయంలో టెస్టు ఫార్మాట్లో బెంచ్ బలం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కానీ అందరూ ఈ ఫార్మాట్లో రాణించలేరు. అందుకే టెస్టు జట్టులో చోటు కావాలనుకునే ఆటగాళ్లు దేశవాళీల్లో ఆడి సత్తా చాటడాన్ని ఒక మార్గం చేసుకునే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వాళ్లు దేశవాళీల్లో లేకపోవడంతో ఈ దేశవాళీల్లో కూడా కొంత క్వాలిటీ దెబ్బతిన్నట్లు కనిపించింది. ఇప్పుడు బీసీసీఐ కనుక అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా రంజీలు ఆడాల్సిందే అంటే.. టీమిండియా మరోసారి పూర్వవైభవం దిశగా తొలి అడుగు వేసినట్లే అని నిపుణులు అంటున్నారు.