హైదరాబాద్: సుప్రీం కోర్టులో కేరళ క్రికెటర్ శ్రీశాంత్కు నిరాశే ఎదురైంది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఆడేందుకు అనుమతించాలంటూ శ్రీశాంత్ దాఖలు చేసిన అభ్యర్థనను మంగళవారం సుప్రీం కోర్టు విచారణకు తిరస్కరించింది. దీంతో పాటు స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్తో సహా ఇతరుల సంగతిని జులైలోగా తేల్చాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.
మళ్లీ తాను క్రికెట్ ఆడాలన్న శ్రీశాంత్ తపనను తాము అర్థం చేసుకుంటామని, ఢిల్లీ పోలీసులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వచ్చే దాకా వేచి చూడాల్సిందేనని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
2013లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్ఫాట్ ఫిక్సింగ్ కేసులో మరో 33 మందిపై అభియోగాలు మోపారు. అయితే, ఈ అభియోగాలను పాటియాలా హౌస్ కోర్టు 2015లో కొట్టివేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు.
దీంతో తనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని శ్రీశాంత్ పెట్టుకొన్న అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గతంలో కేరళ హైకోర్టుకు బీసీసీఐ తెలియజేసింది. ఇక, స్కాటిష్ క్రికెట్ లీగ్ ఆడేందుకు శ్రీశాంత్కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేమని బీసీసీఐ తెలిపింది.