శనివారం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బీసీసీఐ అంబుడ్స్మన్ డీకే జైన్ ముందు హాజరుకానున్నాడు. ఒకవైపు క్యాబ్ అధ్యక్షుడిగా మరోవైపు ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగానూ వ్యవహరిస్తుండటంతో.. గంగూలీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఓ అభిమాని ఫిర్యాదుకు స్పందించిన అంబుడ్స్మన్.. ఇప్పటికే సౌరభ్కు నోటీసులు జారీ చేసి తన ముందు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న అంబుడ్స్మన్ ముందుకు గంగూలీ హాజరుకానున్నాడు.
క్రికెట్ అభిమానులు ఫిర్యాదు:
బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభానికి ముందు సలహాదారుగా నియమించుకుంది. దీంతో క్యాబ్ పదవిలో ఉంటూ.. ఐపీఎల్ జట్టుకు సలహాదారుగా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందంటూ గంగూలీపై ముగ్గురు క్రికెట్ అభిమానులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అంబుడ్స్మన్ గుంగూలీపై చర్యలు తీసుకోనుంది.
గంగూలీ ఇప్పటికే వివరణ:
తన ఎంపిక పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని సౌరవ్ గంగూలీ ఇప్పటికే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. గంగూలీ మాట్లాడుతూ "ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలేమీ లేవు. ఇంతకు ముందే ఐపీఎల్ పరిపాలనా మండలికి రాజీనామా చేశా. సలహాదారు పాత్ర చేపట్టే ముందే సీఓఏను సంప్రదించా" అని చెప్పాడు. ఈ నేపథ్యంలో అంబుడ్స్మన్ డీకే జైన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.