
హైదరాబాద్: ప్రతి రంగంలో రాజకీయాలు అనేవి సాధారణం అయిపోయింది. ఇదే నేపథ్యంలో కోహ్లీపై బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్ తమ ప్రభావాన్ని తగ్గించుకోవాల్సి ఉందట. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ విమర్శకుడైన రామచంద్ర గుహ బట్టబయలు చేశాడు. అంతేగాక, బోర్డు అధికారులు, సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది కోహ్లి ముందు మోకరిల్లుతున్నారని విమర్శించాడు.
విదేశాల్లో భారత విజయవంతం కాకపోవడానికి కారణాల్లో ఇదీ ఒకటని అన్నాడు. భారత ప్రభుత్వ మంత్రిమండలి ప్రధాని నరేంద్ర మోడీని పూజిస్తున్న దాని కంటే కూడా ఎక్కువగా బీసీసీఐ అధికారులు కోహ్లిని పూజిస్తున్నారని చెప్పాడు. భవిష్య పర్యటన ప్రణాళిక, జాతీయ క్రికెట్ అకాడమీ పనితీరు గురించి చర్చించడానికి కూడా కోహ్లి అనుమతి కావాలని కొందరు అధికారులు అన్నారని గుహ తెలిపాడు.
''కోహ్లి తమకు ఎంత సన్నిహితుడో చెప్పడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటారు. నిజానికి వాళ్ల ప్రవర్తన చూస్తే.. కోహ్లితో వారి బంధం యజమాని, సేవకుల బంధంలా అనిపిస్తుంటుంది'' అని గుహ ఓ వ్యాసంలో పేర్కొన్నాడు. రామచంద్ర గుహ ఇప్పటికే భారత క్రికెట్పై ఎన్నో పుస్తకాలు రాశారు. కోహ్లీకి జరుగుతున్న పూజలు, సత్కారాలకు నేనే సాక్షమంటూ అందులో పేర్కొన్నారు.
కోహ్లీకి అనిల్ కుంబ్లేకి వివాదాలు రావడానికి కూడా ఇదే కారణమని తెలిపారు. 'కుంబ్లే చాలా ఖచ్చితమైన మనిషి. క్రికెట్ గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడు. అతను ఓ గొప్ప బౌలర్ కూడా. అతను ఏ పరిస్థితుల్లోనూ తన స్థానికత మార్చుకోలేదు.' ఇదే నేపథ్యంలో విరాట్కు కుంబ్లేకు వివాదాలు రావడంతో అతన్ని తప్పించి రవిశాస్త్రిని నియమించారంటూ బీసీసీఐపై, టీమ్ మేనేజ్మెంట్పై, సిబ్బందిపై పలు విమర్శలు సంధించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.