
ఇంకా చర్చించలేదు
ఓ ప్రముఖ జాతీయ ఛానెల్తో టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారు. కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ఇప్పటికవరకు సెలెక్టర్లు చర్చించలేదని ఆయన తెలిపారు. అయితే కొత్త కెప్టెన్ను ఎంపిక చేయడానికి తగినంత సమయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. నిర్ణీత సమయంలోగా సెలెక్టర్లు కొత్త కెప్టెన్ ఎంపికపై చర్చిస్తారని చెప్పారు.
చర్చించాక తుదుపరి టెస్టు కెప్టెన్ను సెలక్షన్ కమిటీ సిఫారసు చేస్తుందని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా ఉన్నాడని చెప్పారు. అయితే కొత్త కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్ అంశం గురించి మీడియా ప్రశ్నించగా సెలెక్టర్లు అందరి గురించి చర్చిస్తారని, అన్ని ఎంపికలను పరిశీలిస్తారని ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు.

కొత్త కెప్టెన్కు కఠిన సవాల్
టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్కు కఠిన సవాల్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టెస్టు క్రికెట్లో భారత జట్టును విరాట్ ఆ రేంజులో తయారు చేశాడని అంటున్నారు. బ్యాటర్గా ముందుండి నడిపించడమే కాకుండా కోహ్లీ జట్టును బలంగా తీర్చిదిద్దాడు. అంతే కాకుండా కోహ్లీ కెప్టెన్సీలోనే టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో 42 నెలలపాటు అగ్ర స్థానంలో ఉంది. అలాగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ కూడా చేరింది. ఆస్ట్రేలియా వంటి దేశంలో టెస్టు సిరీస్ గెలవడంతోపాటు ఇంగ్లండ్లో టెస్టు సిరీస్లో అధిక్యంలో నిలిచింది. అంతేకాకుండా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా స్వదేశంలో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.

కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్సీ రేసులో రిషబ్ పంత్, రాహుల్, రోహిత్ శర్మ ఉన్నారు. రోహిత్ శర్మకే కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అతని వయసు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం రోహిత్ వయసు 34 సంవత్సరాలు. దీంతో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. స్వదేశంలో శ్రీలంకతో ఆడే టెస్టు సిరీస్ నాటికి సెలెక్టర్లు టీమిండియాకు కొత్త కెప్టెన్ను ఎంపిక చేయనున్నారు.


Click it and Unblock the Notifications












