హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆటల్లో క్రికెట్ ఒకటి. అలాంటి క్రికెట్కు ఒలింపిక్స్లో మాత్రం చోటు దక్కలేదు. చివరిసారి 1900లో పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు లభించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 2024 ఒలింపిక్స్లో టీ20 క్రికెట్కు చోటు కల్పించాలని ఐసీసీ భావిస్తోంది.
ఈ విషయాన్ని ఐసీసీ... ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) దృష్టికి తీసుకెళ్లింది. అయితే క్రికెట్ ఆడే దేశాలు అంగీకరిస్తేనే ఐఓసీ బిడ్డింగ్ వేయాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఐసీసీలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న బీసీసీఐ ఓకే చెబితేనే, ఐసీసీ ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోనుంది.

ఆదాయ పంపిణీ విషయంలో ఐసీసీ తాను అడిగిన మొత్తంలో చెల్లించలేదు కాబట్టి ఒలింపిక్స్లో క్రికెట్ అనే అంశంపై బీసీసీఐ స్పందన అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తమ అవసరం కోసం వచ్చి అడిగితే ఎలా అంగీకరిస్తామని బీసీసీఐలోని ఓ అధికారి స్పష్టంచేశారు.
బోర్డులో చాలా మంది అధికారులు దీనిపై ఆసక్తి చూపడం లేదని ఆయన అన్నారు. బీసీసీఐని ఒప్పిస్తేనే ఈ విషయంలో ఐసీసీ ముందడుగు వేయగలదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత సులువుగా కనిపించడం లేదు.
మరోవైపు క్రికెట్ను ఒలింపిక్స్లో చేరిస్తే తమ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతామన్న ఆందోళన కూడా బీసీసీఐలో ఉంది. ఒకవేళ క్రికెట్ ఒలింపిక్స్లో చేరితే.. బీసీసీఐ కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) కిందికి రావాల్సి ఉంటుంది.
అదే గనుక జరిగితే ఇన్నాళ్లు బోర్డుపై పెత్తనం చెలాయిస్తున్న పెద్ద తమ సర్వాధికారాలను కోల్పోతారు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని బోర్డు తేల్చి చెప్పింది. అయితే ఒలింపిక్స్లో క్రికెట్ అవకాశాలను ఇప్పుడే కొట్టిపారేయలేమని మరో అధికారి అన్నారు.
ఒలింపిక్స్లో క్రికెట్ చేర్చాలనే నిర్ణయాన్ని తామే స్వతంత్రంగా తీసుకుంటాము తప్ప బలవంతంగా తమపై ఐసీసీ రుద్దితే ఊరుకోమని మరో అధికారి అన్నారు. ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే విషయమై బీసీసీఐని ఐసీసీ సంప్రదించినట్లు తెలుస్తోంది.