ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఓవైపు కఠిన పరిస్ధితులు ఎదుర్కొంటోంది. ఓ టెస్టు గెలిచి రెండు టెస్టులు ఓడిపోయింది. ఇప్పుడు తప్పక గెలవాల్సిన సిడ్నీ టెస్టులో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. అయితే అన్నింటి కంటే పెద్ద సమస్యగా మారిన టెస్టు జట్టు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ సైతం మల్లగుల్లాలు పడుతోంది. టీమిండియాలో ఉన్న పరిమిత ఆప్షన్లే అందుకు కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు తర్వాత తప్పుకుంటే కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ జరుగుతోంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో ప్రస్తుతం కంగారూలు 2-1 ఆధిక్యంలో ఉన్నారు. సిడ్నీలో ఎల్లుండి ప్రారంభమయ్యే చివరి టెస్టులో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్ధితి. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సమం చేసే అవకాశాలు, అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలిచే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం టీమిండియా ఫామ్, కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన, ఇతర ఆటగాళ్ల ఫామ్ ఇలా ఎటు చూసినా ఆందోళనకర పరిస్ధితులే నెలకొన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ శర్మ తప్పుకుంటే పరిస్ధితి మరింత దారుణంగా మారనుంది.

సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ శర్మతో పాటు కొహ్లీ కూడా జట్టుకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంటే తప్ప భారత్ కు కొత్త కెప్టెన్ ను వెతుక్కోక తప్పని పరిస్ధితి. దీంతో పెర్త్ టెస్టులో కెప్టెన్సీ తీసుకుని భారత్ ను గెలిపించిన పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఇప్పుడు టెస్టు జట్టు కెప్టెన్సీ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రా కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. అయితే బుమ్రా తరచూ గాయాల పాలవుతుండటం, జట్టుకు అందుబాటులో ఉండకపోవడంతో అతన్ని నమ్మి టెస్టు కెప్టెన్సీ అప్పజెప్పే పరిస్ధితీ లేదు. దీంతో బీసీసీఐ ఆలోచనలో పడింది.
ఇందుకు బీసీసీఐ వద్ద ఉన్న మరో పరిష్కారం కెప్టెన్సీ విభజన. రోహిత్ తరహాలో బుమ్రా టెస్టు, టీ20 ఫార్మాట్లలో జట్టును నడిపించే పరిస్ధితి లేదు. దీంతో టెస్టు జట్టుకు ప్రస్తుతానికి బుమ్రాను కెప్టెన్ గా ప్రకటించి వన్డేలకు కొత్త కెప్టెన్ ను వెతుక్కోవడమే మేలనిపిస్తోంది. రోహిత్ ఇంకా వన్డేల్లో రిటైర్మెంట్ తీసుకోలేదు. కాబట్టి ఎలాగో ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ లలో ఒకరికి వన్డే కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలున్నాయి. టీ20ల్లో ఎలాగో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే మంచి కెప్టెన్ గా రాణిస్తున్నాడు. కాబట్టి ఇదే బీసీసీఐకి బెటర్ ఆప్షన్ లా ఉంది.