ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా జట్టు ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇందులో భాగంగా ప్లేయర్స్ కు చెల్లించే వేతనాలపై చర్చ జరిగినట్లు సమాచారం అందింది. ఇందుకోసం ఓ కొత్త సిస్టమ్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం అందింది. అదే నోవెల్ వేరియబుల్ శ్యాలరీ స్ట్రక్టర్.
కార్పొరేట్ శైలిలో అప్రైజల్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంలో బోర్డు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అంటే మ్యాచుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి వేతనాల పెంపు (అప్రైజల్) ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అదే విధంగా ప్రదర్శన సరిగ్గా చేయని వారికి, వేతనాల్లో కోత విధించే అవకాశం కూడా ఉన్నట్లు చెప్పాయి.

"ఆటగాళ్లు జవాబుదారీగా ఉండాలి. వారు ప్రదర్శనలు అంచనాలకు తగ్గట్టుగా చేయ లేకపోతే, తమ జీతాల్లో కోతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది." అని ఓ అధికారి తెలిపారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలీదు. దీనీపై స్పష్టత రావాలంటే అధికార ప్రకటన రావాల్సిందే.
టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సాహకాలు
గత ఏడాది టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత ఇస్తూ బీసీసీఐ ప్రోత్సాహకాలను అందించడం ప్రారంభించింది. సుదీర్ఘ ఫార్మాట్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచే ప్లేయర్స్ ను ప్రోత్సహిస్తోంది. క్రికెట్ క్యాలెండర్ ఇయర్ లో.. అంటే అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు కనీసం 75 శాతం టెస్ట్లు ఆడే ప్లేయర్ కు, ఒక టెస్ట్ మ్యాచ్కు ఫీజు రూ.15 లక్షలతో పాటు రూ.45 లక్షలు చెల్లిస్తున్నారు. 50 శాతం - 75 శాతం మ్యాచ్లు ఆడే ప్లేయర్స్ కు ఒక్కో మ్యాచ్కు రూ.30 లక్షల బోనస్ అందిస్తున్నారు. జట్టులో ఎంపికై ఆడని సభ్యులకు రూ. 15 లక్షలు ఇస్తున్నారు.