
రూ. 35-40 వేల కోట్ల ధర:
ఐపీఎల్కు మరో జాక్పాట్ తగలనుంది. లీగ్ ప్రసార హక్కులు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడుపోనున్నాయని తెలుస్తోంది. వచ్చే అయిదేళ్ల కోసం ఐపీఎల్ ప్రసార హక్కుల ధర రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ పలుకుతుందని అంచనా. 2018 నుంచి 2022 వరకూ అయిదేళ్ల కాలానికి గాను గతంలో రూ.16,347 కోట్లు చెల్లించి స్టార్ ఇండియా.. ఆ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే అయిదేళ్లకు అంతకంటే చాలా ఎక్కువ ధరే పలికే అవకాశాలున్నాయి. అయితే టీవీ, డిజిటల్ ప్రసార హక్కులకు కలిపి రూ. 35-40 వేల కోట్ల ధర పలకవచ్చని తెలుస్తోంది. ఏదిఏమైనా వచ్చే ఏడాది మాత్రం బీసీసీఐకి కాసుల వర్షం కురవనుంది.

60 నుంచి 74కు:
వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లీగ్లో 10 జట్లు తలపడుతున్నాయి. రెండు కొత్త ప్రాంఛైజీల కోసం ఆర్పీఎస్జీ రూ.7090 కోట్లు, సీవీసీ క్యాపిటల్స్ రూ.5625 కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. దాంతో రూ.12,715 కోట్లు ఐపీఎల్ ఖజానాలో చేరనున్నాయి. వచ్చే సీజన్ నుంచి మ్యాచ్ల సంఖ్య 60 నుంచి 74కు పెరుగుతుంది. ఆ తర్వాత సీజన్లలోనూ మ్యాచ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గతంలో మ్యాచ్కు రూ.54.5 కోట్లు చెల్లించేలా స్టార్ ఇండియా ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పుడు వచ్చే సీజన్లలో మ్యాచ్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రసార హక్కుల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికలకు ఆదరణ పెరిగింది. దీంతో ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకునేందుకు అవి కూడా పోటీపడే ఆస్కారముంది. వాటి మధ్య పోటీ కూడా ఈ రేటు పెరిగేందుకు ఓ కారణం.

ఐపీఎల్ 15 కోసం మెగా వేలం:
ఐపీఎల్ 15 కోసం మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని పూర్తి చేసే పనిలో పడింది. బోర్డు రూపొందించిన ఈ పాలసీకి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఒక్కక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. పాత జట్లలోని ప్రతీ టీమ్ గరిష్టంగా నలుగురిని రిటైన్ చేసుకోవచ్చట. ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లు, మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్ ఉండాలి. పాత జట్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్లు, వేలానికి అందుబాటులో ఉండే జాబితా నుంచి కొత్తగా వచ్చిన జట్లు ముగ్గురి ప్లేయర్లను తీసుకోవాలి. ఆ తర్వాతే మెగా వేలం జరుగుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications












