IPL 2025: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ఆగిపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2025ను పునఃప్రారంభించే దిశగా బీసీసీఐ ప్రయత్నాలను ప్రారంభించింది. పంజాబ్ కింగ్స్మినహా అన్ని ఐపీఎల్ జట్లు మంగళవారం(మే 13) నాటికి వారి వారి వేదికలకు చేరుకోవాలని బీసీసీఐ ఆదివారం ఫ్రాంచైజీలకు సూచించింది. కొత్త షెడ్యూల్ను రూపొందించి త్వరలో ఐపీఎల్ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు బోర్డు ఫ్రాంచైజీలకు మౌఖికంగా తెలియజేసినట్లు సమాచారం. ఫ్రాంచైజీలు తమ విదేశీ ఆటగాళ్లకు ప్రయాణ ప్రణాళికల గురించి కూడా తెలియజేయాలని బీసీసీఐ కోరింది.
బీసీసీఐ ప్లాన్ ఇదే..
మంగళవారం(మే 13) వరకు అన్ని జట్ల ఆటగాళ్లు అందుబాటులోకి వస్తే ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 25నే ఐపీఎల్ 2025ను ముగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మిగిలిన 12 లీగ్ మ్యాచ్ లను డబుల్ హెడర్లతో ముగించాలని బోర్డు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఐపీఎల్ వాయిదా పడిన వెంటనే చాలా మంది విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అదే రోజు సాయంత్రం తమ ఇళ్లకు బయలుదేరారు. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీలు తిరిగి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఐపీఎల్ ను షెడ్యూల్ చేసిన తేదీకి అంటే మే 25 వరకు పూర్తి చేయాలనుకుంటున్నందున.. మంగళవారం నాటికి రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఫ్రాంచైజీలను కోరినట్లు తెలుస్తోంది.

మిగిలి ఉన్న 16 మ్యాచ్లు
ఐపీఎల్ టోర్నమెంట్లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి బీసీసీఐ డబుల్ హెడర్లతో లీగ్ను పునఃప్రారంభించాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా లీగ్ నిర్వహించడానికి భారత ప్రభుత్వం నుంచి బీసీసీఐ అనుమతి పొందకపోతే.. మిగిలిన మ్యాచ్లను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో నిర్వహించవచ్చు.
ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటాం-సైకియా
ఐపీఎల్ పునఃప్రారంభం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా మాట్లాడుతూ.. కొత్త షెడ్యూల్ను ప్రకటించే ముందు ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని అన్నారు. ఈ సమయంలో ఐపీఎల్ ప్రాముఖ్యత నేపథ్యంలో దానిని తిరిగి ప్రారంభించే సమయాన్ని ఖరారు చేసే ముందు భారత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం కూడా అవసరమని ఆయన అన్నారు. మొత్తం ప్రక్రియ సకాలంలో పూర్తయిన తర్వాత ఐపీఎల్ పునఃప్రారంభ తేదీని బీసీసీఐ త్వరలో ప్రకటిస్తుంది.