హైదరాబాద్: ఫిబ్రవరి 9 నుంచి నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్ సజావుగా సాగేందుకు పరిశీలకుడిని నియమించాలని బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీవోఏ)ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.
బీసీసీఐ పంపిన పరిశీలకుడికి 2014 సెప్టెంబర్లో ఏర్పడిన హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) కార్యవర్గం సహకారం అందించాలని స్పష్టంచేసింది. అప్పటి వరకు ఈ మ్యాచ్కు పరిశీలకుడిగా వచ్చిన బోర్డు జనరల్ మేనేజర్ (గేమ్ డెవల్పమెంట్) రత్నాకర్ షెట్టి ఏర్పాట్లను చూడాలని స్పష్టం చేసింది.
భారత్-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ నిర్వహణ ద్వారా సమకూరిన నిధులను హెచ్సీఏ బ్యాంకు ఖాతాలో జమచేయాలని తేల్చిచెప్పింది. మ్యాచ్ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని బీసీసీఐ పరిశీలకుడి అనుమతితో ఖర్చుచేయాలని హైకోర్టు పేర్కొంది. బంగ్లాతో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్కు పరిశీలకుడిని నియమించాలని పిల్ దాఖలైన సంగతి తెలిసిందే.
హెచ్సీఏ సారథ్య బాధ్యతల వ్యవహారంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొన్నందున టెస్ట్ మ్యాచ్ నిర్వహణ కోసం ఓ పరిపాలకుడిని నియమిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ప్రముఖ న్యాయవాది, క్రికెట్ క్రీడాకారుడు గోవింద్రెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిల్ను విచారించిన ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే మ్యాచ్ పర్యవేక్షణకు బీసీసీఐ జనరల్ మేనేజర్ రత్నాకర్ శెట్టిని పరిశీలకుడిగా పంపిందని ధర్మాసనం గుర్తుచేసింది.
బీసీసీఐ నుంచి తన ప్రతినిధిని పంపే వరకు రత్నాకర్ శెట్టి ఆ బాధ్యతలను చూస్తారని ధర్మాసనం పేర్కొంది. హెచ్సీఏ అకౌంట్లను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైతే బీసీసీఐ ఒక ఆర్థిక సలహాదారుడిని నియమించుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ టెస్టు మ్యాచ్ పూర్తయిన తర్వాత నిధులు దుర్వినియోగం చేసిన హెచ్సీఏ సభ్యులపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవచ్చని ధర్మాసం పేర్కొంది. ఇదే సమయంలో హెచ్సీఏకు సమకూరిన నిధులు, ఖర్చులపై నివేదిక రూపొందించి తదుపరి విచారణకు కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది.