ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో కొన్ని మార్పులు చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది.
చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడలు.. వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ సమయంలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈ క్రీడల్లో పాల్గొనాలని డిసైడ్ అయిన బీసీసీఐ.. ఆసియా క్రీడలకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో యువ జట్టును పంపాలని నిర్ణయించింది.
సీనియర్ల టీం అంతా వరల్డ్ కప్ కోసం రెడీ అవుతున్న సమయంలోనే.. ఈ కుర్ర జట్టు ఏషియన్ గేమ్స్కు వెళ్లనుంది. ఇంతకుముందే ఈ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే తాజాగా ఏషియన్ గేమ్స్కు వెళ్లే పురుషుల, మహిళల జట్లలో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించింది. రెండు టీమ్స్ కెప్టెన్లుగా రుతురాజ్ గైక్వాడ్, హర్మన్ప్రీత్ కౌర్ కొనసాగుతున్నారు.

హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత సీనియర్ మహిళల జట్టు తమ పూర్తి బలంతో ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే కొంత మంది ప్లేయర్లు గాయాలతో ఈ జట్టులో చోటు కోల్పోయారు. మహిళల జట్టులో హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణాలను బ్యాకప్ ప్లేయర్లుగా ప్రకటించారు. అలాగే గాయంతో అంజలీ శర్వాణి జట్టుకు దూరమైందని, ఆమె స్థానంలో పూజ వస్త్రాకర్ను ఎంపిక చేశామని బీసీసీఐ తెలిపింది.
అదే సమయంలో పురుషుల వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టును చైనా పంపనున్నారు. ఈ టీంలో చోటు సంపాదించుకున్న స్టార్ పేసర్ శివమ్ మావి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే రిజర్వ్ ప్లేయర్లుగా యష్ ఠాకూర్, సాయి కిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్లను ఎంపిక చేశారు.
ఇంతకుముందు ప్రకటించిన జట్టునే దాదాపుగా కొనసాగించారు. అయితే గాయాలపాలైన ప్లేయర్లు, అలాగే అందుబాటులో లేని ప్లేయర్లను జట్టులో నుంచి సెలెక్టర్లు తప్పించారు. ఆసియా క్రీడల్లో సెప్టెంబరు 19 నుంచి 28 వరకు మహిళల టీం పోటీలు, అలాగే సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 8 వరకు పురుషుల టీం మ్యాచులు జరగనున్నాయి. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచులకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్నట్లు ఐసీసీ ధ్రువీకరించింది.
భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయి, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఆకాష్ దీప్
రిజర్వ్ ప్లేయర్లు: యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్
మహిళల బృందం: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగెజ్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, టిటాస్ సధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కణికా అహూజా, ఉమా ఛెత్రి, అనూషా బారెడ్డి, పూజా వస్త్రాకర్
రిజర్వ్ ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్