ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆటగాళ్ల అసలు వేతనాలను బిసిసిఐ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఆటగాళ్లు ఐపీఎల్లో పలికే ధరకు... వారికి ముట్టజెప్పే మొత్తానికి తేడా ఉంటుంది. అయితే, వారికి చెల్లించే 'అసలు' వేతనాన్ని బిసిసిఐ వెల్లడించవచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీని 2010 నుంచి అట్టిపెట్టుకుంటూ వస్తోంది. అతని ధర రూ.12.5 కోట్లు. అయితే అతనికి చెల్లించేది మాత్రం రూ.25 కోట్లకు పైనే అని తెలుస్తోంది. అలాగే మిగతా ఆటగాళ్లకు అట్టిపెట్టికున్న ధర కంటే ఎక్కువ మొత్తాన్నే ఫ్రాంచైజీలు చెల్లిస్తున్నాయి.
ఆటగాళ్లను ఏ నిర్ణీత ధరకు అట్టిపెట్టుకున్నప్పటికీ పరస్పర అవగాహన మేరకు ఆ మొత్తం కన్నా తక్కువైనా, ఎక్కువైనా ఎంతైనా చెల్లించే వీలు ఫ్రాంఛైజీలకు ఉంది. అయితే ఈ మొత్తం ఎంతన్నది వెల్లడించాల్సిన అవసరం ఇప్పటిదాకా లేదు.

కానీ బిసిసిఐ.. త్వరలో అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు చెలించే డబ్బు వివరాల్ని వెల్లడించాల్సిందేనన్న నిబంధన తేబోతుందని తెలుస్తోంది. ఆటగాళ్లతో ఒప్పందాల రద్దు, ఫ్రాంఛైజీల మధ్య మార్పిడి ప్రక్రియ ఈ నెల 31తో ముగియనుంది. ఆ తర్వాత అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు చెల్లిస్తున్న ధరను ఫ్రాంచైజీలు చెప్పాలట.
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు కూడా డిసెంబర్ 31 తర్వాత బోర్డు వెబ్సైట్లో కనిపిస్తాయని అంటున్నారు. బోర్డు ఆదేశాలు అమల్లోకి వస్తే మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేష్ రైనా తదితర ఆటగాళ్ల అసలు వేతనాలు తేలిపోతాయి.
అయితే, బోర్డ్ నిర్ణయం ఫ్రాంఛైజీలకు పెద్ద షాక్. ఈ నిర్ణయాన్ని ఫ్రాంఛైజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆటగాళ్లను వ్యాపార ప్రయోజనాల కోసం కూడా వాడుకుంటున్న ఫ్రాంఛైజీలు అనూహ్య మొత్తంలో చెల్లింపులు చేస్తున్నాయి.
అసలు ధర వెల్లడిస్తే అది తమ వ్యాపార వ్యూహాలకు ఇబ్బంది ఏర్పడుతుందని, మిగతా ఆటగాళ్లలో అసూయ మొదలై జట్టు వాతావరణం కూడా దెబ్బ తినొచ్చని ఆవేదన చెందుతున్నాయి. ఆడిటింగ్ సందర్భంగా ఆటగాళ్లకు చేసే చెల్లింపుల గురించి బహిర్గతం చేయవల్సి ఉంటుందని, అలాంటప్పుడు అదే వివరాలు అందరికీ తెలిస్తే నష్టమేమిటని ఇంకొందరు అంటున్నారు.