ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి మూడేళ్లకూ ఓసారి మెగా వేలం నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. జట్లు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని మిగతా వాళ్లను విడిచిపెడతాయి. విడుదలయిన ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లూ వేలంలోకి వస్తారు. చివరగా 2018 సీజన్కు ముందు మెగా వేలం జరిగింది. వచ్చే సీజన్ ముంగిట మళ్లీ ఆ వేలం జరగాల్సి ఉంది. అయితే ఐపీఎల్ 2020 ఆలస్యంగా జరిగిన నేపథ్యంలో తర్వాతి సీజన్కు పెద్దగా సమయం లేకపోవడంతో ఈసారికి మెగా వేలాన్ని వాయిదా వేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.
ఐపీఎల్ 2021కి ఫిబ్రవరిలో చిన్న స్థాయిలోనే వేలాన్ని నిర్వహించనున్నారని సమాచారం తెలుస్తోంది. 2022 సీజన్ ముంగిట మెగా వేలం జరగనుందట. 2022కు అదనంగా లీగ్లోకి రెండు జట్లను చేర్చనుండటం కూడా మెగా వేలం వాయిదాకు ఓ కారణం. డిసెంబర్ 24న అహ్మదాబాద్లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వేలం విషయంపై పూర్తి స్పష్టత రానుంది. అలాగే కొత్తగా చేర్చే ఒకటి లేదా రెండు జట్లను 2022 నుంచి లీగ్లో ఆడించే విషయంపై ఓ స్పష్టత రానుంది.
దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 31 వరకు జరగనుంది. ఐపీఎల్ 2021 వేలం సమయంలో టోర్నీలో పాల్గొనే దేశవాళీ ఆటగాళ్ల ప్రదర్శన, ప్రతిభను అంచనా వేయడానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఉపయోగపడనుంది. సత్తాచాటిన కొత్త కుర్రాళ్లు ఐపీఎల్ 2021లో ఆడే అవకాశాలు ఉన్నాయి. అందుకే యువ ఆటగాళ్లు ముస్తాక్ అలీ టీ20 టోర్నీపై కన్నేశారు. ఈసారి రవి బిష్ణోయ్, దేవదత్ పడిక్కల్, నటరాజన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి వారు ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2021లో ఒకటి లేక రెండు జట్లను అదనంగా చేర్చబోతున్నట్టు ఇటీవలి కాలంలో జోరుగా కథనాలు వినిపించాయి. కానీ హడావిడిగా కొత్త జట్లను చేర్చే ప్రయత్నాలను ప్రస్తుత ఫ్రాంచైజీలలో చాలా వరకు వ్యతిరేకిస్తున్నాయట. మరో రెండు జట్లని టోర్నీలోకి ఆహ్వానిస్తే? అప్పుడు ఆటగాళ్ల కోసం మెగా వేలం ఆవశ్యంకానుంది. అంతేకాదు బ్రాడ్కాస్టర్ హక్కులు, స్ఫాన్సర్షిప్కి సంబంధించిన ఒప్పందాలని కూడా సవరించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం జరిగే లీగ్ను 8 జట్లతోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఐపీఎల్కు ఇంకో మూడున్నర నెలలే సమయం ఉన్నందున కొత్త జట్లను చేర్చడం సాధ్యం కాదని భావిస్తోందట. 2022 నుంచి పది జట్లతో ఐపీఎల్ను జరపాలని బోర్డు భావిస్తోంది. ఈనెల 24న అహ్మదాబాద్లో జరిగే బోర్డు ఏజీఎంలో ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటారు.
'టీమిండియాపై ఆశల్లేవు.. టెస్ట్ సిరీస్ను ఆసీస్ 4-0తో గెలుస్తుంది'