టీమిండియా కొత్త కోచ్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గౌతమ్ గంభీర్ ఎంపికవ్వడం దాదాపు ఖాయమైన తరుణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గౌతమ్ గంభీర్తో పాటు డబ్ల్యూవీ రామన్ను భారత జట్టు కోచ్గా ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ భారత జట్టు కోచ్ బాధ్యతలకు గుడ్బై చెప్పనున్న విషయం తెలిసిందే. ద్రవిడ్ స్థానంలో సమర్థవంతమైన వ్యక్తి కోసం కోచ్ పదవికి బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తులలో ఇద్దరిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసింది. గంభీర్తో పాటు రామన్ను ఇంటర్వ్యూ చేసింది.

ఇంటర్వ్యూలో గంభీర్-రామన్ ఇద్దరూ ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వడంతో కోచ్ ఎంపిక విషయంలో బీసీసీఐ సందిగ్ధతలో పడింది. గంభీర్కు కోచ్గా అనుభవం లేకపోవడమూ ఓ కారణం. ఐపీఎల్లో గంభీర్ మెంటార్గా మాత్రమే సేవలందించాడు. అది కూడా గత మూడు సీజన్లలో మాత్రమే. 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ను ప్లేఆఫ్స్కు చేర్చాడు. 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను విజేతగా నిలిపాడు.
మరోవైపు కోచ్గా రామన్కు అనుభవం ఉంది. దేశవాళిలో తమిళనాడు, బెంగాల్ జట్లకు రామన్ శిక్షణ ఇచ్చాడు. 2018-2021 మధ్య కాలంలో భారత మహిళా జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేశాడు. అంతేగాక ఐపీఎల్లో రెండు ఫ్రాంచైజీలకు రామన్ బ్యాటింగ్ కోచ్గా సేవలందించాడు. పంజాబ్ కింగ్స్, కేకేఆర్కు బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు. 2013లో తిరిగి ఫామ్ అందుకోవడంలో గంభీర్కు రామన్ కేకేఆర్ క్యాంప్లో సాయం చేశాడు.
గత రికార్డుల పరంగా రామన్ను ఎంపిక చేయకపోవడానికి బీసీసీఐకి బలమైన కారణం దొరకట్లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ కోచ్గా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను, బ్యాటింగ్ కోచ్గా డబ్ల్యూవీ రామన్ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. అలాగే వన్డే, టీ20లకు గంభీర్ను, టెస్టు ఫార్మాట్కు రామన్ను హెడ్ కోచ్గా సెలక్ట్ చేసే ఆలోచనలోనూ బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. కాగా, మరికొన్ని గంటల్లో ఈ విషయం గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.